శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఆగస్టు నుంచి సర్వదర్శనం

శుక్రవారం, 9 జులై 2021 (13:27 IST)
శ్రీవారి భక్తులకు శుభవార్త. భక్తులు ఎంతగానో ఎదురుచూస్తున్న తిరుమల శ్రీవారి సర్వ దర్శనాలు త్వరలోనే మళ్లీ ప్రారంభం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆగస్టులో శ్రీవారి సర్వ దర్శనాలు స్టార్ట్ కావొచ్చని తెలుస్తోంది. 
 
కరోనా పాజిటివిటీ రేటు 1 శాతానికి వస్తే భక్తులకు ఉచిత దర్శన సేవలు పునఃప్రారంభించాలని టీటీడీ భావిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుతున్నాయి. మరో 20 రోజుల్లో కేసుల సంఖ్య మరింత తగ్గే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా, ప్రస్తుతం రూ.300 దర్శన టికెట్ తీసుకున్న వారికి మాత్రమే స్వామిని దర్శించుకునే అవకాశం కల్పించారు.
 
కరోనా నేపథ్యంలో గతేడాది 2020 మార్చి 20 నుంచి స్వామి వారి సేవలు టీటీడీ ఏకాంతంగా నిర్వహిస్తోంది. కోవిడ్‌ నివారణ చర్యల్లో భాగంగా కొన్నాళ్లు భక్తులకు దర్శనం కూడా నిలిపివేసింది. 2020 జూన్‌ 7నుంచి రోజుకు 5 వేల మందితో ప్రత్యేక ప్రవేశ దర్శనం (రూ.300) ఆన్‌లైన్‌ ద్వారా టికెట్లు జారీ చేసి దర్శనాలు ప్రారంభించింది. ఆ తర్వాత సామాన్యులకు సైతం స్వామి దర్శనం కల్పించాలనే లక్ష్యంతో సర్వదర్శనం టోకెన్లు కూడా జారీ చేసింది. వీటి కోసం వేలాదిమంది భక్తులు పోటెత్తారు.
 
అయితే కరోనా వ్యాప్తి చెందే ప్రమాదం ఏర్పడటంతో టీటీడీ సర్వదర్శనం నిలిపివేసింది. ప్రస్తుతం రాష్ట్రంతో పాటు చిత్తూరు జిల్లాలో కూడా పాజిటివిటీ రేటు క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఈ రేటు 1 శాతానికి వచ్చి భక్తుల ఆరోగ్య భద్రతకు ఇబ్బంది లేని పరిస్థితి నెలకొంటే ఆగస్ట్‌లో స్వామి వారి సేవలకు పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతించడానికి టీటీడీ సమాయత్తమవుతోంది. సేవలతో పాటు సామాన్యులకు ఉచిత దర్శనం కల్పించడానికి సిద్ధమవుతోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు