త్రికూటేశ్వరుడు కొలువైన కోటప్ప కొండ

బుధవారం, 24 సెప్టెంబరు 2008 (19:46 IST)
కైలాశాధినేత అయిన ఆ మహా శివుడు త్రికూటేశ్వరుని రూపంలో కొలువైన దివ్య సన్నిది కోటప్ప కొండ. యల్లమంద కోటయ్యగా భక్తులకు ప్రీతి పాత్రుడైన శివుడు కోటప్ప కొండలో కొలువై భక్తుల కొంగు బంగారంగా విలసిల్లుతున్నాడు. గుంటూరు జిల్లా నరసారావు పేట సమీపంలో వెలసిన ఈ దివ్య క్షేత్రం శివరాత్రి పర్వ దినాన భక్తులతో కిటకిటలాడుతుంది.

కోటప్ప కొండ విశేషాలు
త్రికోటేశ్వరునికి నెలవైన కోటప్ప కొండ మొత్తం మూడు భాగాలుగా ఉండడం విశేషం. మూడు భాగాలుగా ఉన్న ఇందులోని మొదటి కొండపై ముసలి కోటయ్యగారి గుడి నిర్మితమై ఉంది. అయితే ఈ గుడి శిధిలావస్థలో ఉంది. రెండో కొండపై త్రికూటేశ్వర స్వామి వారి దేవాలయం కలదు.

ఈ దేవాలయానికి సమీపంలో ఓ పెద్ద పుట్ట కూడా ఉంది. వీటితో పాటు నవగ్రహముల దేవాలయము, ద్యాన మందిరం లాంటివి కలవు. త్రికూటేశ్వరుని పూజించే భక్తులు పుట్టను సైతం అదే భక్తి ప్రవుతులతో పూజించడం ఇక్కడి విశేషం. ఇక మూడో కొండపై బొచ్చు కోటయ్య గారి గుడితో పాటు కళ్యాణ కట్ట, సిద్ధి వినాయకుని దేవాలయం ఉన్నాయి.

దేవాలయ పరిధిలో ఉత్సవాలు
కోటప్ప కొండ త్రికూటేశ్వరునికి సంబంధించి ప్రభల సంభరం అనేది విశేషంగా జరపబడే ఓ ఉత్సవం. ఈ ఉత్సవంలో భాగంగా చుట్టుపక్కల గ్రామాల నుంచి చిన్న పిల్లల చేతుల్లో చిన్న చిన్న ప్రభల నుండి దాదాపు డెబ్బై, ఎనబై అడుగుల వరకు ఎత్తు కలిగి చక్కగా అలంకరించబడ్డ ప్రభలను శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా కొండవద్దకు తీసుకువస్తారు.

కొండ కింద ఉంచే ఈ ప్రభలు ఒక్కోసారి వేల నుంచి లక్షల సంఖ్యలో కన్పిస్తూ కొండపై నుంచి చూసేవారికి కనువిందు చేస్తాయి.

దేవాలయంలో వసతి సౌకర్యాలు
కోటప్ప కొండపై టీటీడీ నిర్మించిన సత్రముతో పాటు ప్రభుత్వంచే నిర్మించబడిన రెస్ట్ హౌస్ ఉంది. కొండ దిగువ భాగంలో సైతం కొన్ని సత్రాలు అందుబాటులో ఉన్నాయి. కోటప్ప కొండ చేరుకోవడానికి నరసారావుపేట బస్టాండ్ నుంచి బస్సులు, ఆటోలతో సహా వివిధ రకాల వాహనాలు అందుబాటులో ఉన్నాయి.

వెబ్దునియా పై చదవండి