రిపబ్లిక్ డే... మరో హాలీడే...

దాదాపు రెండు సంవత్సరాల క్రితం ఒక లఘు చిత్రం పలు టెలివిజన్ ఛానళ్లలో ప్రసారమైంది. లఘు చిత్రం ప్రారంభం కాగానే ఒక నగరానికి చెందిన రహదారి మన కనుల ముందు సాక్షాత్కరిస్తుంది. రహదారికి ఇరువైపులా గల కాలిబాట మీద పానీపూరీలు, దినపత్రికలు అమ్ముకునే వాళ్లు గుమిగూడి ఉంటారు. స్కూల్ అయిపోగానే తల్లితో కలిసి రహదారి చెంతకు వచ్చిన పిల్లవాడు ఒకడు పానీపూరీలు కొనివ్వమని మాతృమూర్తిని సతాయిస్తుంటాడు.

ఈలోపల రానున్న వర్షానికి పైలెట్ లాగా గాలిదుమారం లేచింది. తన దినపత్రికలను కాచుకునేందుకు దినపత్రికలు విక్రయించే వ్యక్తి వాటి దగ్గరకు పరిగెడుతుంటాడు. కాలిబాట మీద గడియారాలు బాగు చేసే వ్యక్తి తల మీద వాన నీటి చుక్కలు పడతాయి. దాంతో అతను కూడా తన సామాగ్రిని తీసుకుని పరుగు లంకించుకుంటాడు. అప్పటిదాకా నేల మీద కూర్చున్న బిచ్చగాడు, గాలికి ఎగిరిపోతున్న కరెన్సీ నోటు వెనుక పరిగెడుతుంటాడు.

అదే సమయంలో రేడియో నుంచి జనగణమన గీతం వినపడటం ప్రారంభమవుతుంది. తమ ప్రయోజనాల పరిరక్షణార్థం గీతాన్ని వినిపించుకోకుండా జనం పరిగెడుతుండగా... కాలిబాట పైన గల ఒక దుకాణానికి చెందిన వికలాంగులు తరుముకొచ్చే వానను లెక్కచెయ్యక... జాతీయ గీతానికి గౌరవ సూచకంగా దుకాణం పక్కన గల స్థంభాన్ని ఆసరాగా చేసుకుని అంకిత భావంతో నిలబడి ఉంటారు. వారికి సమీపంలోనే బూట్ పాలిష్ దుకాణంలో పనిచేసే మరో ముగ్గురు పిల్లలు కూడా నిలబడతారు. లఘు చిత్రం దృశ్యం కొనసాగుతుండగానే నేపథ్యంలో అమితాబ్ బచ్చన్ స్వరం వినపడుతుంది.

"జాతీయ గీతాన్ని గౌరవించడంలో సిగ్గుపడతారెందుకు, జాతీయ గీతాన్ని గౌరవించడం... దేశాన్ని గౌరవించడంతో సమానం."

ప్రతి ఏటా స్వాతంత్రదినం, గణతంత్ర దినం మరియు గాంధీ జయంతి వస్తుంటాయి, వెళ్లిపోతుంటాయి. కానీ మన దృష్టిలో ఇవన్నీ కూడా కేవలం సెలవు దినాలు మాత్రమే. దేశం పట్ల గౌరవాన్ని ప్రకటించడంలో మనం పాతాళంలో ఉన్నాం. అందుకేనేమో 52 సెకండ్ల కాల వ్యవధి కలిగిన జాతీయ గీతం వినిపిస్తుంటే లేచి నిలబడటానికి వెనుకాడుతుంటాం.

ఒక్కసారి గత కాలపు వైభవాన్ని నెమరువేసుకుందాం...

అప్పట్లో అనేక సినిమా హాళ్లలో ఈ దృశ్యం సర్వసాధారణంగా కనిపించేది. ట్రయల్ పార్టీ (న్యూస్ రీల్) తోపాటుగా సినిమా ప్రదర్శన ముగియగానే జాతీయ గీతాన్ని హాలు నిర్వాహకులు వినిపించడం మొదలు పెడతారు. గీతం ప్రారంభం కావడం ఆలస్యం... హాలులోని ప్రేక్షకులందరూ జాతీయ గీతానికి గౌరవసూచకంగా లేచి నిలబడేవారు. కాలానుగుణంగా జాతీయ గీతం పట్ల మనలో తొలగిపోయిన గౌరవానికి నిదర్శనంగా ఆ సాంప్రదాయం కాస్త కనుమరుగైపోయింది.

దీని తాలూకు దయనీయమైన సంఘటన 1994లో చోటు చేసుకుంది. అదేసంవత్సరం '1942- ఏ లవ్ స్టోరీ' అనే హిందీ చిత్రం విడుదలైంది. ఆ చిత్రంలో జనగణమన గీతం వినపడే సందర్భంగా ఉండటంతో...

"దయచేసి జాతీయ గీతానికి గౌరవసూచకంగా లేచి నిలబడండి".

అనే ఉపవ్యాఖ్య ద్వారా నిర్మాత ప్రేక్షకులను వేడుకున్నారు. మన బానిస బతుకులకు మంగళం పాడటంలో కీలకపాత్ర పోషించిన శుభ ఘడియలకు నిదర్శనమైన జాతీయ పర్వదినాలను మించిన పండుగలు మన మతాలలో, ఆచారాలలో కాగడా పెట్టి వెతికినా కానరావు. దేశాన్ని, జాతీయ పతాకాన్ని గౌరవించడంలో ముందు వరుసలో నిలబడదాం... నవభారత నిర్మాణంలో చేయి చేయి కలుపుదాం...

జైహింద్

వెబ్దునియా పై చదవండి