పెళ్లయిన దంపతులు బహిరంగంగా ముద్దుపెట్టుకోవడం అభ్యంతరకరమేమీ కాదనీ, అది అశ్లీలత కిందకూ రాదని... ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. పెళ్లైన యువజంట తమ ప్రేమను వ్యక్తపరచుకునేందుకు ముద్దు పెట్టుకుంటే అది నేరమెలా అవుతుందని న్యాయస్థానం ప్రశ్నించింది.
ఢిల్లీలో కొత్తగా పెళ్లయిన దంపతులు బహిరంగంగా ముద్దు పెట్టుకున్నారంటూ.. పోలీసులు వారిపై అసభ్య ప్రవర్తన నేరాభియోగం మోపి కేసు నమోదు చేశారు. ఢిల్లీ మెట్రో రైల్వే స్టేషన్లో ఒక స్తంభానికి ఆనుకుని అభ్యంతరకర భంగిమల్లో బహిరంగంగా ముద్దులు పెట్టుకున్నారని, అటుగా వెళ్లేవారు వీరిని చూసి ఇబ్బంది పడ్డారని పోలీసులు ఎఫ్ఐఆర్లో ఆరోపించారు.
అయితే... పోలీసుల కేసును సవాల్ చేస్తూ ఆ యువజంట హైకోర్టుకెక్కడంతో విషయం వెలుగులోకి వచ్చింది. కేసు విచారణను చేపట్టిన న్యాయమూర్తి ఎస్. మురళీధరన్.. పోలీసులు అభియోగాలను ఏ మాత్రం ఏకీభవించలేదు. అంతేగాకుండా, పెళ్లైన ఆ యువ జంట చేసిందాంట్లో తప్పేమీ లేదని తేల్చి చెప్పారు. మాకు పెళ్లైంది బాబో అని వారు మొత్తుకుంటున్నా, వినకుండా కేసు ఎలా పెడతారని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
ఇదిలా ఉంటే... తాము అసలు ముద్దే పెట్టుకోలేదని, తమను తాము ఫోటోలు మాత్రం తీసుకున్నామని ఆ నూతన దంపతులు వాదించటం కొసమెరుపు. సో... నూతన దంపతులూ మీ పార్టనర్ను అమాంతం ముద్దు పెట్టుకోవాలని అనిపిస్తే.. ఎక్కడ ఉన్నామన్నది మరచిపోయి దూసుకెళ్లిపోండి. అంతే... పోలీసులు మీ జోలికి వస్తే... కోర్టే వారి పని చూసుకుంటుంది. అన్నట్టు ఈ సౌకర్యం పెళ్లయిన వాళ్లకేనండోయ్....!