జగనూ నన్ను.. "రోశయ్య" అంటావా..?: సీఎం మథనం!

FILE
"జగనూ నన్ను రోశయ్య అంటావా..?" అని రాష్ట్ర ముఖ్యమంత్రి కె. రోశయ్య ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు సన్నిహిత వర్గాల సమాచారం. దివంగత మహానేత వై.ఎస్.రాజశేఖర రెడ్డి తనయుడు, కడప ఎంపీ వై.ఎస్.జగన్మోహన రెడ్డిని కుమారుడిగా భావిస్తున్నానని చెప్పుకుంటున్న సీఎం, జగన్ తనను ఏకవచనంతో సంభోదించడంపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు పార్టీ శ్రేణుల సమాచారం.

వైఎస్సార్ తనయుడైతే మాత్రం ముఖ్యమంత్రి హోదాలో ఉన్న కె. రోశయ్యను మీడియా ముందు అలా సంభోదించడంపై తెలంగాణ మంత్రులు, రోశయ్య వర్గాలు అసంతృప్తితో ఉన్నారు. ఇప్పటికే సీఎంను గౌరవ ప్రదంగా సంబోధించకపోవడంపై నిజామాబాద్ ఎంపీ మధుయాష్కీ జగన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. గౌరవ ముఖ్యమంత్రిని ఏకవచనంతో సంబోధించడం.. యూపీఏ ఛైర్ పర్సన్ సోనియా గాంధీనే అవమానపరచడమని వ్యాఖ్యానించారు. ఇదే తరహాలో తెలంగాణ మంత్రులంతా రోశయ్యపై జగన్ వ్యాఖ్యలపై మండిపడుతున్నారు.

ఇందులో భాగంగా.. రోశయ్య వారసుడిగా ప్రచారంలో ఉన్న సౌమ్యుడు, వివాద రహితుడిగా పేరొందిన మర్రి శశిధర్ రెడ్డి కూడా జగన్ వ్యాఖ్యలపై స్పందించారు. సీఎంపై ఢిల్లీలో జగన్మోహన రెడ్డి చేసిన వ్యాఖ్యలు అనుచితమన్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న కె. రోశయ్యపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సబబు కాదని ఆయన హితవు పలికారు.

మరి.. జగన్ వ్యాఖ్యలపై సీఎం మాత్రం ఇప్పుడే నోరు మెదపనని అంటున్నారు. జగన్ వ్యాఖ్యల్లో ఆరోపణలున్నాయనే విషయాన్ని నిశితంగా పరిశీలించాకే ఈ విషయంపై మాట్లాడుతానని చెప్పారు. కానీ జగన్ ఏకవచనంతో సంబోధించడంపై మాత్రం రోశయ్య గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. మరి జగన్ వర్సెస్ రోశయ్య ఫైర్ ఎంతవరకు కొనసాగుతుందో? వేచి చూడాల్సిందే..?

వెబ్దునియా పై చదవండి