మరి మీ జిల్లాలో మాటేమిటి?

సోమవారం, 29 సెప్టెంబరు 2008 (17:06 IST)
వార్త : కోస్తాలోని కొన్ని జిల్లాలకు తాను ఇన్‌ఛార్జి మంత్రిగా ఉండి జరిపిన పరిశీలనలో చిరంజీవి నేతృత్వంలోని ప్రజారాజ్యం పార్టీకి కేవలం నాలుగు సీట్లు మాత్రమే వస్తాయని, కాంగ్రెస్‌నే మళ్లీ గద్దెనెక్కించాలని ప్రజలు కోరుకుంటున్నారని మంత్రి జేసీ దివాకర్ రెడ్డి అన్నారు.

చెవాకు : మీరు ఇన్‌ఛార్జి మంత్రిగా ఉన్నందున పరిస్థితిని పూర్తిగా మీ పార్టీకి అనుకూలంగా ఉండేలా చేశారా లేక ప్రజలు మీరే కావాలని, మీ పాలన తప్ప మరో గత్యంతరం లేదని భావిస్తున్నారా?

మీ పార్టీయే గెలుస్తుందనే నమ్మకం ఉంటే ప్రత్యర్థి రాజకీయ పార్టీ అయిన టీడీపీ నుంచి బయటకు వస్తున్న వారు మీ పార్టీలో చేరవచ్చు కదా. ప్రయోజనం లేకుండా బయటకు రాని వారందరూ ప్రజారాజ్యంలోకే ఎందుకు వెళుతున్నట్టు.

అందులోనూ మీది అధికార పార్టీ. మరో ఆరునెలల పాటు అధికారంలో ఉండే అవకాశం కలిగి ఉన్నవారు. మిమ్మల్ని కాదని మరో పార్టీలోకి వెళుతున్నారంటే ఆలోచించాల్సిన విషయమేగా.

అందులోనూ మీ పార్టీ నుంచి హరిరామ జోగయ్య అంతటి సీనియర్ మరో పార్టీలోకి ఎందుకు వెళ్లినట్టు. ఎన్నికలు దగ్గర పడేకొద్దీ మీ పార్టీ నుంచి కూడా భారీగా వలసలు పెరిగే అవకాశం ఉందంటున్నారు. ఔను మంత్రివర్యా, మీ జిల్లాలో పరిస్థితి ఎలా ఉందో మరి.

వెబ్దునియా పై చదవండి