వార్త : రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం తామేనని డాక్టర్ మిత్రా చేసిన వ్యాఖ్యలపై మండిపడిన టీడీపీ అధికార ప్రతినిధి నన్నపనేని రాజకుమారి చంద్రబాబును కానీ, టీడీపీని కానీ పరోక్షంగా విమర్శించే హక్కు ప్రజారాజ్యం పార్టీకి లేదన్నారు.
చెవాకు : రాజకీయ పార్టీలపై ప్రత్యర్థి రాజకీయపార్టీ నేత విమర్శలు చేయడం సహజమేనన్న విషయం ఇప్పటివరకు మీకు తెలియక పోవడం విచారకరం. అది కొత్త పార్టీ కావచ్చు లేక పాత పార్టీ కావచ్చు విమర్శలు వస్తూనే ఉంటాయి.
మీరు కూడా గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న సమయంలో టీడీపీని, చంద్రబాబును విమర్శించలేదా. ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి తగ్గట్టు మాట్లాడకపోతే రాజకీయాల్లో నిలబడటం కష్టమే కదా.
ఎన్నికల్లో గెలవలేమని తెలిసి కూడా పోటీ చేసే వాడు సైతం విజయం తనదేనని ఢంకా భజాయించుకుంటాడు. అలాంటి స్థితిలో తమ పార్టీయే ప్రత్యామ్నాయమని మిత్రా చెప్పడంలో తప్పేమీ లేదే.
రాజకీయాల్లో రాని ఎందరో వ్యక్తులు పత్రికల ద్వారా రాజకీయాలను క్షుణ్ణంగా పరిశీలిస్తుంటారు. అలాంటి వారు ఇలా ఏదో సందర్భం దొరికినపుడు తమ రాజకీయ నైపుణ్యానికి పదును పెట్టుకుంటుంటారు. ఇంతవరకు బహిరంగంగా బయటకు రానంత మాత్రాన మిత్రాకు రాజకీయానుభవం లేదని ఎలా చెప్పగలరు.