''ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని ఎంత చెప్పినా నన్ను బలవంతం పెట్టి మరో అమ్మాయితో పెళ్లి చేసారు. నా భార్యగా వచ్చిన ఆమెతో నేను ఇప్పటివరకూ సుఖపడింది లేనేలేదు. అలాగే నేను ఇష్టపడిన అమ్మాయిని విడిచి బ్రతకలేను. అందుకే అమ్మా-నాన్నా నన్ను క్షమించండి. నేను నా ప్రియురాలితో కలిసి చనిపోతున్నా'' అంటూ తెలంగాణలోని బీబీ నగర్ మండలం కొండమడుగులో 39 ఏళ్ల సుధాకర్ తన ప్రియురాలు పాసాల సుష్మితతో కలిసి ఇద్దరూ ఆత్మహత్య చేసుకుని మరణించారు.
ఆత్మహత్యకు ముందు సుధాకర్ ఓ వీడియో విడుదల చేసాడు. తను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటానంటే పెద్దలు అంగీకరించలేదనీ, వారి ఒత్తిడితో మరో అమ్మాయిని వివాహం చేసుకున్నట్లు తెలిపాడు. ఐతే పెళ్లి జరిగిన దగ్గర్నుంచి తన భార్యతో తనకు సుఖం లేదనీ, పొద్దస్తమానం ఎవరితో ఒకరితో లింకు పెడుతూ తనకు మనశ్శాంతి లేకుండా చేసిందని ఆవేదన వ్యక్తం చేసాడు. ఇంత ఘోరమైన జీవితం బ్రతకడం కంటే చనిపోవడమే మంచిదనీ, అందుకే తన ప్రియురాలితో కలిసి చనిపోతున్నట్లు తెలిపాడు.