సహ్యాద్రి శోభ, సెలయేళ్ల నాదంతో పరవశించే "మంగళూరు"

FILE
కర్ణాటక రాష్ట్రంలోని ప్రధాన నగరాలలో ఒకటి "మంగళూరు". ఈ నగర సముద్ర తీరప్రాంతం చుట్టుప్రక్కల అంతా కొబ్బరిచెట్లతో నిండి ఉంటుంది. ప్రకృతి రమణీయ దృశ్యాలకు, సముద్ర తీర అందాలకు, సహ్యాద్రి కొండల వంపుసొంపులకు, అక్కడ ప్రవహించే శోభకు మంగళూరు పెట్టింది పేరు. బీచ్‌లు, దేవాలయాలు, పరిశ్రమలు, బ్యాంకింగ్, విద్యాసంస్థలకు ప్రసిద్ధి చెందిన మంగళూరుకు ఓ సారలా వెళ్లివద్దామా..?!

కర్ణాటక రాష్ట్రానికి, భారతదేశానికి ఒక నౌకాశ్రయాన్నిచ్చిన మంగళూరు నగరం.. భారతదేశానికి పశ్చిమానగల అరేబియా సముద్ర తీరంలో పశ్చిమ కనుమలకు పశ్చిమదిక్కులో ఉంది. దక్షిణ కన్నడ జిల్లా రాజధాని మరియు అధికార, పరిపాలనా కేంద్రంగా విలసిల్లుతున్న ఈ నగరం కర్ణాటకకు, దక్షిణ కన్నడ జిల్లాకు నైరుతీదిశలో ఉంది. ఇక్కడి నౌకాశ్రయం కృత్రిమంగా నిర్మించబడింది.

కాగా.. నేత్రావతి, గుర్‌పుర్ నది ఒడ్డున ఈ ప్రాంతం ఉండటంవల్ల అరేబియా సముద్ర జలాలు కొద్దిగా వెనక్కు వస్తుంటాయి. అదలా ఉంచితే, మలబార్ తీరంలో మంగళూరు కూడా ఒక భాగమే కావటం గమనార్హం. రాష్ట్ర భాష అయిన కన్నడ, ఉడిపికి ప్రాంతీయ భాష అయిన తుళు, కేరళకు సరిహద్దుల్లో ఉండటంవల్ల మళయాలం, కొంకణి జనాభా కూడా ఉండటంవల్ల కొంకణి భాషలు మంగళూరులో వాడుకలో ఉన్నాయి. ప్రాంతీయ భాషలే కాకుండా.. హిందీ, ఆంగ్లం కూడా మాట్లాడతారు.

మంగళూరుకు ఆ పేరు ఎలా వచ్చిందంటే.. నగర దేవతైన మంగళాదేవి పేరే నగరం పేరుగా స్థిరపడినట్లు పూర్వీకులు చెబుతుంటారు. అదే విధంగా అనేక శతాబ్దాలుగా ఈ నగరం వివిధ సంస్కృతులకు నిలయం కావటంతో, అక్కడ నివసించే భిన్నజాతులవారు తమ తమ మాతృభాషలలో మంగళూరుకు అనేకమైన పేర్లు పెట్టారు. అలా స్థానిక భాషలో మంగళూరును "కుడ్ల" అని పిలుస్తారు. కుడ్ల అంటే కూడలి అని అర్థం.

అలాగే నేత్రావతి, ఫల్గుణి నదుల సంగమస్థానం కావటంవల్ల మంగళూరుకు ఆ పేరు వచ్చినట్లుగా చెబుతుంటారు. కొంకణి భాషలో మంగళూరును "కొడియల్" అని పిలుస్తుంటారు. ఇక ముస్లింలలో ఒక వర్గంవారైతే ఈ నగరాన్ని "మైకల" అని ముద్దుగా పిల్చుకుంటారు. దక్షిణ కేరళ ప్రాంత ప్రజలు మాత్రం "మంగళాపురం"గా పిల్చుకుంటుంటారు. ఇదిలా ఉంటే.. 2006లో "సువర్ణ కర్ణాటక" పేరుతో మంగళూరును "మంగలూరు"గా కర్ణాటక ప్రభుత్వం మార్పుచేసింది.

FILE
సముద్ర మట్టానికి 45 మీటర్ల ఎత్తులో ఉండే మంగలూరు పట్టణం అరేబియా సముద్రంలో భాగమైన కొంకణ తీరంలో ఉండే గోవాకు దగ్గర్లో ఉంది. 3వ జాతీయ రహదారుల ద్వారా మంగళూరు దేశానికి కలుపబడుతుంది. మహారాష్ట్రలోని పణవెల్ నుంచి ప్రారంభమై కేరళలోని క్రణగాణురు జంక్షన్ వరకూ మంగళూరు రహదారి వెళుతుంది. ఎన్.హెచ్-48 మంగళూరు నుంచి బయలుదేరి కర్ణాటక రాజధాని తూర్పువైపుకు బెంగళూరుదాకా వెళుతుంది. ఎన్.హెచ్-13 ఈశాన్య మార్గంలో షోలాపూర్ మీదుగా మడికరి, మైసూర్ పట్టణాలమీదుగా పోతుంది. మంగళూరు నుంచి బెంగళూరువరకూ మధ్య ప్రతిదినం 300 బస్సులు నడుస్తుంటాయి.

మంగళూరు చుట్టుప్రక్కల అనేక దర్శనీయ స్థలాలు ఉన్నాయి. వాటిలో పణంబూర్ బీచ్, ఉల్లాల్ బీచ్, నేత్రావతి బ్రిడ్జి, కద్రి ఉద్యానవనం, లాల్‌బాగ్, సుల్తాన్ బత్తెరీ, మంగళాదేవి ఆలయం, కద్రి దేవాలయం, సెయింట్ అలోసియస్ చర్చి మరియు కాలేజీ, కొత్త మంగళూరు రేవు, గోకర్ణనాథేశ్వర ఆలయం, శరవు మహా గణపతి ఆలయం.. తదితరాలు ముఖ్యందా చూడాల్సిన పర్యాటక ప్రాంతాలు.

రవాణా మార్గాల విషయానికి వస్తే.. కర్ణాటక రోడ్డు రవాణా సంస్థ మంగళూరు నుంచి సుదూర ప్రాంతాలకు బస్సులను నడుపుతోంది. మంగళూరు-బెంగళూరు మధ్య ఫ్యాసింజర్ రైల్వే సౌకర్యం లేని కారణంగా కేఎస్ఆర్టీసీ బస్సుల్ని నడుపుతోంది. అతిపెద్ద దూరమైన మంగళూరు-అంకోలా-హుబ్లీ-బెల్గాం-పూణే-ముంబయిలకు కూడా ప్రైవేటు బస్సులు నడుస్తుంటాయి. మామూలు బస్సులైనతే 22 గంటలు, వోల్వో బస్సుల్లో అయితే 16 గంటలు ప్రయాణించవలసి ఉంటుంది.

విమాన మార్గం విషయానికి వస్తే.. మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం నగర నడిబొడ్డుకు ఈశాన్యదిశగా 20 కిలోమీటర్ల దూరంలో ఊరి పొలిమేరలైన బజ్‌పేలో ఉంది. మంగలూరు వాతావరణం డిసెంబర్-ఫిబ్రవరి నెలలమధ్య చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. వేసవిలో మాత్రం అత్యధిక ఉష్ణోగ్రత ఉంటుంది. వేసవి తరువాత రుతుపవనాలు మొదలుకాగానే, భారతదేశంలోని పట్టణ ప్రాంతాలన్నింటిలోకెల్లా అత్యధిక వర్షపాతాన్ని నగరంలో నమోదు చేసుకుంటుంది.

వెబ్దునియా పై చదవండి