స్టాక్ మార్కెట్‌పై బడ్జెట్ సానుకూల ప్రభావం

అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం, ఐటీ, క్యాపిటల్ గూడ్స్, మెటల్, బ్యాకింగ్ వాటాలు లాభాలను ఆర్జించడంతో బాంబే స్టాక్ మార్కెట్ భారీ లాభాలను నమోదు చేసుకుంది. బుధవారం ట్రేడింగ్ ప్రారంభంలోనే పుంజుకున్న సెన్సెక్స్ ఒక దశలో 400 పాయింట్లు పెరిగి 12 నెలల గరిష్ట స్థాయికి చేరుకుంది.

దీంతో ట్రేడింగ్ ముగిసే సమయానికి బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్ 339 పాయింట్లు భారీగా వృద్ధిచెంది, 15,466 పాయింట్ల మార్కు వద్ద ముగిసింది. అదేవిధంగా నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 104 పాయింట్ల మేర పుంజుకుని 4,655 పాయింట్ల వద్ద నిలిచింది.

ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశ పెట్టనుండటంతో స్టాక్ మార్కెట్‌పై సానుకూల ప్రభావం చూపింది. అంతర్జాతీయ మాంద్య పరిస్థితుల మధ్య భారత్ ఆర్థికాభివృద్ధి రేటు మళ్లీ 9 శాతానికి చేరగలదంటూ ప్రధాని మన్మోహన్ సింగ్ లోక్‌సభలో చేసిన వ్యాఖ్యలతో మంగళవారం 461 పాయింట్ల పెరుగుదలతో 15,127 పాయింట్ల వద్ద ముగిసింది. ఇదే ఊపుతో బుధవారం కూడా సెన్సెక్స్ ఒక్కసారిగా భారీ లాభాలను ఆర్జించింది.

ఇక లాభపడ్డ కంపెనీల్లో ల్యాంకో, ఇండియా సిమెంట్స్, ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్, వీడియోకాన్ ఇండస్ట్రీస్, ఐవీఆర్‌సీఎల్ ఇన్ఫ్రా వంటి సంస్థలుండగా, హెచ్ఐడీఎల్, అబాన్ ఆఫ్‌షోర్ లిమిటెడ్, ఎంఎంటిసి లిమిటెడ్, జై కార్పొరేషన్ లిమిటెడ్, ఆర్ఈఐ అగ్రో లిమిటెడ్ వంటి కంపెనీలు నష్టాలను చవిచూశాయి.

వెబ్దునియా పై చదవండి