కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు... రూ.లక్షల కోట్ల సంపద ఆవిరి

మంగళవారం, 6 ఫిబ్రవరి 2018 (11:25 IST)
భారత స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. అమెరికా క్రెడిట్ రేట్లను తగ్గించడంతో పాటు.. ఫెడరల్ బ్యాంకు వడ్డీ రేట్లను పెంచే అవకాశాలుండడంతో వాట్‌స్ట్రీట్ మార్కెట్‌కు లాభాల స్వీకరణ ఒత్తిడి పెరిగింది. దీంతో ఆసియా మార్కెట్ సూచీలు కూడా వేగంగా స్పందించాయి. ఫలితంగా 4 శాతం మేర పతనమయ్యాయి.
 
ఇప్పటికే భారత స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా, ఈనెల ఒకటో తేదీన కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన 2018-19 వార్షిక బడ్జెట్‌తో మార్కెట్లు కుప్పకూలిన విషయం తెల్సిందే. ఇపుడు అమెరికా మార్కెట్ తీవ్ర ప్రభావం చూపడతో మరోమారు కుప్పకూలిపోయింది. ఫలితంగా రూ.5 లక్షల కోట్ల సంపద క్షణాల్లో ఆవిరైపోయింది. 
 
అమెరికా క్రెడిట్ రేట్ల ప్రభావంతో అంతర్జాతీయ మార్కెట్లు నష్టాలను చవిచూస్తుండడంతో ఆ ప్రభావం కూడా భారత మార్కెట్లను కోలుకోలేని దెబ్బతీసింది. దీంతో ట్రేడింగ్ ఆరంభంలోనే సెన్సెక్స్ 1250 పాయింట్లు కోల్పోగా.. ఎన్ఎస్‌ఈ నిఫ్టీ కూడా 290.05 పాయింట్లు (2.72 శాతం) కూలబడి 10,376.50 వద్ద ట్రేడయింది. దీని ఫలితంగా ఓపెనింగ్‌లోనే మదుపరుల సంపద సెకన్ల వ్యవధిలో రూ.5.4 లక్షల కోట్ల మేర ఆవిరైపోయింది. 
 
ఒకానొకస్థాయిలో 1250 పాయింట్లకు పైగా పతనమైన సెన్సెక్స్... 33,482.81 వద్దకు చేరింది. తర్వాత కొద్దిగా కోలుకుని ప్రస్తుతం 1048.73 పాయింట్ల నష్టంతో 33,708.43 వద్ద ట్రేడవుతోంది. ఇక నిఫ్టీ మాత్రం 327.10 పాయింట్ల మేర మరింత పతనమై 10,339.45 వద్ద తచ్చాడుతోంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు