ఐడబ్ల్యూఎఫ్ నిర్లక్ష్యమే నేటి దుస్థితికి కారణం : మల్లీశ్వరి
FILE
భారత వెయిట్ లిఫ్టింగ్లో డోపీలు పెరిగిపోవడానికి భారత వెయిట్ లిప్టింగ్ సమాఖ్య (ఐడబ్ల్యూఎఫ్) నిర్లక్ష్య వైఖరే కారణమని ఒలింపిక్ కాంస్య పతక విజేత కరణం మల్లీశ్వరి ఆరోపించింది. అలాగే డోప్ టెస్టుల్లో పట్టుబడ్డ లిఫ్టర్లపై ఐడబ్ల్యూఎఫ్ మెతక వైఖరిని అనుసరించడమే నేటి వెయిట్ లిఫ్టింగ్ దుస్థితికి కారణమని ఆమె తీవ్రంగా స్పందించింది.
గత సెప్టెంబర్లో ఏకంగా ఆరుగురు భారత లిఫ్టర్లు డోప్ టెస్టులో విఫలమవటంతో లిఫ్టింగ్ సమాఖ్య నిషేధపు అంచున దిక్కుతోచని స్థితిలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో అంతర్జాతీయ వెయిట్ లిఫ్టింగ్ సమాఖ్య కఠిన చర్యలకే మొగ్గు చూపే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.
ఈ నేపథ్యంలో మల్లీశ్వరి మాట్లాడుతూ.. ప్రస్తుతం భారత వెయిట్ లిఫ్టింగ్ సమాఖ్యలో చోటు చేసుకుంటున్న పరిణామాలు బాధాకరమని పేర్కొంది. డోప్ ఫలితాలపై ఐడబ్ల్యూఎఫ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని చాలా ఆందోళనగా ఉందనీ, అయితే నిషిద్ధ ఉత్ప్రేరకాలు వాడుతున్న లిఫ్టర్ల పట్ల కఠినంగా వ్యవహరించి ఉంటే.. ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదన్నారు.
దేశంలో వెయిట్ లిఫ్టింగ్ భవిష్యత్ అయోమయంలో పడిపోయిందని ఆందోళన వ్యక్తం చేసిన మల్లీశ్వరి... డోప్ టెస్టుల్లో పట్టుబడి నిషేధం అనుభవిస్తున్న వారిని కూడా మళ్లీ జట్టులో తీసుకుంటూ వచ్చారని వాపోయింది. సమాఖ్యపై నిషేధం వేటుగనుక పడితే, కామన్వెల్త్ క్రీడల్లో మన పతకాలకు గండి పడుతుందనీ... ఎందుకంటే మన లిఫ్టర్లు ఈ టోర్నీలో ఖచ్చితంగా పతకాలు సాధించేవారని మల్లీశ్వరి ఆవేదన వ్యక్తం చేసింది.