గత సంవత్సరం అత్యున్నతస్థాయిలో సాధించిన విజయాల స్ఫూర్తితో, కొత్త సంవత్సరంలో మరింత ఎత్తుకు ఎదగాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు భారత టెన్నిస్ యువకెరటం సోమ్దేవ్ వర్మన్ వెల్లడించాడు. ప్రస్తుతం 126వ ర్యాంక్లో ఉన్నప్పటికీ, సాధ్యమైనంత త్వరగా టాప్-100 దూసుకెళ్లటమే తన తాజా లక్ష్యమని పేర్కొన్నాడు.
టాప్-100 సాధించాక, సంవత్సరం పొడవునా స్థిరంగా రాణించటంపై దృష్టి పెడతానని సోమ్దేవ్ వివరించాడు. గత సంవత్సరం చెన్నై ఓపెన్లో సాధించిన సంచలన విజయాలతో ఒక్కసారిగా ఈ అస్సాం యువకుడు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది కూడా చెన్నై ఓపెన్తో సీజన్ను ప్రారంభిస్తున్న సోమ్దేవ్ మీడియాతో ఉత్సాహంగా ముచ్చటించాడు.
గత ఏడాది వ్యక్తిగత ప్రదర్శన సంతృప్తినిచ్చిందనీ, అత్యున్నతస్థాయిలో నిలకడగా ఆడే సత్తా తనలో ఉందన్న విషయాన్ని గ్రహించానని సోమ్దేవ్ వివరించాడు. ఉత్తమ క్రీడాకారుడిగా పేరుతెచ్చుకోవాలంటే ముందుగా ర్యాంకింగ్ను మెరుగుపర్చుకోవాలనీ, అదంతా స్థిరంగా ఉన్నప్పడే సాధ్యమవుతుందన్నాడు. అందుకే సాధ్యమైనంత తక్కువ సమయంలో టాప్-100 ర్యాంకింగ్స్లో చోటు సంపాదించాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నట్లు సోమ్దేవ్ చెప్పాడు.