బ్యాడ్మింటన్: అత్యుత్తమ రెండో ర్యాంకులో సైనా నెహ్వాల్!
PTI
భారత మేటి బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, హైదరాబాదీ అమ్మాయి సైనా నెహ్వాల్ మరోసారి అత్యుత్తమ ర్యాంకును సొంతం చేసుకుంది. ఇటీవలే బ్యాడ్మింటన్ ర్యాంకింగ్స్లో మూడో స్థానాన్ని కైవసం చేసుకుని రికార్డు సృష్టించిన సైనా నెహ్వాల్, మరో అడుగు ముందుకేసి రెండో ర్యాంకులో నిలబడింది. ఫలితంగా అగ్రస్థానానికి సైనా నెహ్వాల్ ఒక అడుగు దూరంలో నిలిచింది.
ఇండోనేషియా, సింగపూర్ సూపర్ సిరీస్ టైటిళ్లను సొంతం చేసుకుని వరుస విజయాలతో దూసుకెళ్తున్న సైనా నెహ్వాల్, తాజాగా విడుదలైన ప్రపంచ బ్యాడ్మింటన్ మహిళ ర్యాంకింగ్స్లో చైనా క్రీడాకారిణి ఇవాన్ వాంగ్ మొదటి స్థానంలో నిలువగా, సైనా ఆమె తర్వాతి స్థానాన్ని సొంతం చేసుకుంది. ఇక మూడో స్థానాన్ని చైనాకే చెందిన జింగ్ వాంగ్ కైవసం చేసుకుంది.
ఈ సందర్భంగా సైనా నెహ్వాల్ మాట్లాడుతూ.. తాజాగా సాధించిన మూడు వరుస విజయాలే ప్రపంచ బ్యాడ్మింటన్ ర్యాంకింగ్స్ను మెరుగుపరుచుకోవడానికి తోడ్పడ్డాయని తెలిపింది. అత్యంత తక్కువ కాలంలోనే ప్రపంచ రెండో ర్యాంకును కైవసం చేసుకోవడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పింది. ర్యాంకు సాధించడం కంటే భారత్కు మరిన్ని పతకాలు సాధించిపెట్టడమే తన లక్ష్యమని సైనా నెహ్వాల్ చెప్పుకొచ్చింది.
అలాగే ప్రస్తుత ర్యాంకులో కొనసాగడం అంత సులభం కాదని, దీనికోసం విజయపరంపరను కొనసాగించాలని సైనా నెహ్వాల్ తెలిపింది. ఇంకా భవిష్యత్తులో జరిగే టోర్నీల్లో విజేతగా నిలిచి టాప్ ర్యాంకును సొంతం చేసుకునే తొలి భారతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా రికార్డు సృష్టించేందుకు తీవ్రంగా శ్రమిస్తానని సైనా వెల్లడించింది.