కామన్‌వెల్త్ గేమ్స్‌కే దిక్కులేదు.. ఇక ఒలిపిక్స్ బిడ్డింగ్ ఒకటి తక్కువ

బుధవారం, 1 మార్చి 2017 (07:08 IST)
ఒలింపిక్స్, కామన్వెల్త్‌ గేమ్స్‌ తదితర క్రీడల నిర్వహణ పెను భారమవుతుండడంతో ఆతిథ్యానికి కొన్ని దేశాలు వెనకడుగు వేస్తున్నాయి. మోయలేని ఆర్థిక భారమంటూ 2024 ఒలింపిక్స్‌ బిడ్డింగ్‌ సమయంలోనే బుడాపెస్ట్‌ తప్పుకుంటే... తాజాగా ఇప్పటికే కామన్వెల్త్‌ గేమ్స్‌ (2022) ఆతిథ్య హక్కులు పొందిన డర్బన్‌ డబ్బుల్లేవంటూ తప్పుకునేందుకు సిద్ధమైంది. మెగా ఈవెంట్‌ బడ్జెట్‌ భారంగా ఉందని, అంత వ్యయం చేయలేమంటూ దక్షిణాఫ్రికా క్రీడల మంత్రి ఫికిల్‌ ఎంబలులా స్పష్టం చేశారు. తమ ఆర్థిక వ్యవస్థ దీని వల్ల ఒడిదొడుకులు ఎదుర్కొనే అవకాశముందని, అందుకే అన్నీ ఆలోచించాకే తప్పుకునేందుకు నిర్ణయించుకున్నామని ఆయన చెప్పారు. 2015లోనే 2022కు సంబంధించిన కామన్వెల్త్‌ గేమ్స్‌ ఆతిథ్య హక్కులు డర్బన్‌కు దక్కాయి.
 
చమురు ధరల పతనం నేపథ్యంలో అప్పుడు పోటీపడిన ఎడ్‌మాంటన్‌ (కెనడా) తప్పుకోవడంతో బరిలో ఉన్న ఏకైక నగరం డర్బన్‌కు హక్కులు కట్టబెట్టారు. గత డిసెంబర్‌లో కూడా ఘనమైన నిర్వహణకు మేం కట్టుబడి ఉన్నామంటూ దక్షిణాఫ్రికా చెప్పుకొచ్చింది. కానీ రెండు నెలల వ్యవధిలోనే మాట మార్చింది... మా వల్ల కాదంటూ చేతులెత్తేసింది. 
 
దక్షిణాఫ్రికా ప్రభుత్వం ఈ క్రీడల నిర్వహణ కోసం ముందుగా రూ.10 వేల కోట్లు  (1.54 బిలియన్‌ డాలర్లు)గా అంచనా వేసింది. ఇది తమ ఆర్థిక వ్యవస్థ తట్టుకునేలా లేదం టూ ఇప్పుడు తాపీగా తప్పుకుంది. దీనిపై కామన్వెల్త్‌గేమ్స్‌ కమిటీ తుదినిర్ణయం తీసుకోవాల్సి వుంది.
 

వెబ్దునియా పై చదవండి