చరిత్ర సృష్టించిన నీరజ్ చోప్రా.. జావెలిన్ త్రోలో గోల్డ్ మెడల్

సోమవారం, 28 ఆగస్టు 2023 (09:16 IST)
ఒలింపిక్స్ క్రీడల్లో భారత క్రీడాకారుడు నీరజ్ చోప్రా చరిత్ర సృష్టించాడు. జావెలిన్ త్రో విభాగంలో దేశానికి బంగారు పతకం సాధించిపెట్టాడు. హంగేరీలోని బుడాపెస్ట్ వేదికగా జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ ఫైనల్ పోటీల్లో అద్భుత ప్రదర్శనతో గోల్డ్ మెడల్ దక్కించుకున్నాడు. ఈ పోటీల్లో బంగారు పతకం సాధించిన తొలి భారతీయ క్రీడాకారుడిగా చరిత్ర సృష్టించాడు. 
 
సోమవారం జరిగిన ఈ పోటీల్లో క్వాలిఫైయర్స్ నీరజ్ ఈటెను 88.77 మీటర్ల దూరం విసిరి ఫైనల్లో అడుగుపెట్టాడు. ఆ తర్వాత ఫైనల్స్ తొలి ప్రయత్నంలో విఫలమైనా రెండో మారు జావెలిన్ త్రోను 88.17 మీటర్లు విసిరాడు. పిమ్మట వరుసగా 86.32, 84.64, 87.73, 83.98, మీటర్ల దూరానికి విసిరాడు. మరోవైపు నీరజ్ ప్రత్యర్థులు కిషోర్ జెనా 84.77 మీటర్లతో ఐదో స్థానానికి పరిమితం కాగా, డీపీ మను 84.14 మీటర్ల దూరం విసిరి ఆరో స్థానంలో నిలిచాడు. 
 
ఈ పోటీల్లో రజతం సాధించిన పాక్ క్రీడాకారుడు అర్షద్ నదీమ్ జావెలిన్‌ను 87.82 మీటర్ల దూరం విసిరాడు. ఈటెను 86.67 మీటర్ల దూరం విసిరిన చెక్ క్రీడాకారుడు జాకబ్ వడ్లాచ్ కాంస్య పతకం సాధించాడు. ఇదిలావుంటే, పురుషుల 4x400 మీటర్ల రిలే విభాగంలో భారత బృందం 2.59.92 సెకన్లతో రేసును ముగించి 5వ స్థానంలో నిలిచింది. ఈ పోటీల్లో యూఎస్ఏ జట్టు స్వర్ణం గెలుచుకుంది. మహిళల 3000 స్టీపుల్ చెజ్ విభాగంలో భారత క్రీడాకారిణి పరుల్ చౌదరి 11వ స్థానంలో నిలిచింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు