ఒలింపిక్స్ షూటింగ్లో రజత పతక విజేత విజయ్ కుమార్కు కామన్వెల్త్ క్రీడల్లో త్రివర్ణ పతాకాన్ని ధరించే భాగ్యం లభించింది. బ్రిటన్లోని గ్లాస్గోలో ఈ క్రీడల ప్రారంభోత్సవం బుధవారం జరగనుంది. ఈ వేడుకలో విజయ్ కుమార్ భారత బృందానికి నేతృత్వం వహిస్తాడని భారత చెఫ్-డి-మిషన్ రాజ్ సింగ్ తెలిపారు. కాగా, లండన్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత యోగేశ్వర్ దత్ను విజయ్ కుమార్కు (రిజర్వ్) ప్రత్యామ్నాయంగా ఎంపిక చేశారు.
కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొనే భారత బృందానికి ఏర్పాటు చేసిన బస సౌకర్యాలపై అధికారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బ్రిటన్ లోని గ్లాస్గో నగరంలో ఏర్పాటు చేసిన క్రీడాగ్రామంలో మనవాళ్ళకు కామన్ బాత్రూంలు ఎదురయ్యాయి. నగరానికి ఈస్ట్ ఎండ్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఈ అథ్లెటిక్ విలేజ్లో క్రీడాకారులకు చిన్న చిన్న ఇళ్ళలో బస కల్పించారు. ఇవన్నీ గుడిసెలను తలపిస్తున్నాయని, గదులు ఇరుకుగా ఉన్నాయని టేబుల్ టెన్నిస్ కోచ్ భవానీ ముఖర్జీ వాపోయారు.
కొన్ని ఫ్లోర్లలో రెండు బాత్రూంలు ఉంటే, మరికొన్ని ఫ్లోర్లలో ఒకే బాత్రూం ఉందని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. గతంలో ఢిల్లీ కామన్వెల్త్ క్రీడల సందర్భంగా మెరుగైన సౌకర్యాలు కల్పించారని టేబుల్ టెన్నిస్ తెలుగుతేజం ఆచంట శరత్ కమల్ తెలిపాడు.