జగన్మోహినిగా మురిపించిన శ్రీనివాసుడు

తిరుమల తిరుపతి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా.. బుధవారం ఉదయం శ్రీ శ్రీనివాసుడు జగన్మోహిని అవతారమెత్తి భక్తులను మురించాడు. మంగళవారం కల్పవృక్ష వాహనంపై ఊరేగిన శ్రీవారు.. ఐదో రోజు ఉదయం మోహిని అవతారంగా దర్శనిమిచ్చాడు. అలాగే రాత్రికి గరుడ వాహనంపై ఊరేగనున్నారు. బ్రహ్మోత్సవాలకే హైలెట్‌గా నిలిచే గరువడ వాహానాన్ని తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు తరలి వచ్చారు.

దీంతో తిరుమలలో ఎటూ చూసినా భక్త జనసందోహం కనుచూపు మేరలో దర్శనమిస్తోంది. ఇదిలావుండగా బుధవారం రాత్రి జరిగే గరుడ వాహన సేవకు తిరుమల తిరుపతి దేవస్థానం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ సేవను తిలకించేందుకు లక్ష మందికిపైగా భక్తులు వస్తారని భావించిన తితిదే అందుకు తగిన రీతిలోనే ఏర్పాట్లు చేసింది. గరుడ వాహన సేవ సందర్భంగా ఎలాంటి తొక్కిసలాట జరగకుండా ఉండేందుకు ప్రత్యేకంగా బారికేడ్లను ఏర్పాటు చేసింది.

అయితే ఈ వాహన సేవకు వచ్చే భక్తులను మెటల్ డిటెక్టర్లతో తనిఖీ చేస్తున్నారు. తిరుమల కొండపైకి వచ్చే వాహనాలకు ప్రత్యేక పార్కింగ్ స్థలాన్ని కల్పించారు. బ్రహ్మోత్సవాలకు ఇప్పటికే రెండు వేల మంది పోలీసులు బందోబస్తులో ఉండగా.. గరుడ వాహన సేవకు మరికొంత మందిని అదనంగా బందోబస్తుకు నియమించారు.

భక్తులతో పాటు.. వీఐపీలు స్వామి వారిని దర్శించుకునేందుకు వీలుగా తితిదే ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. శ్రీనివాసుడు విహరించే నాలుగు మాడా వీధుల్లో బాంబు నిర్వీర్య బృందాలతో పాటు.. సాయుధ బలగాలు, అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తంగా ఉన్నాయి.

వెబ్దునియా పై చదవండి