కృష్ణాష్టమి రోజున పసుపు రంగు దుస్తులు ధరించండి..

ఆదివారం, 13 ఆగస్టు 2017 (15:18 IST)
కృష్ణాష్టమి నాడు భక్తుడు శ్రీకృష్ణుడిని నిష్ఠతో పూజించేవారికి సకల సంపదలు చేకూరుతాయి. కృష్ణాష్టమి నాడు భక్తులు పగలంతా ఉపవాసం ఉండి, సాయంకాలం శ్రీకృష్ణున్ని పూజిస్తారు. శ్రావణ మాసంలో లభించే పళ్ళు, శొంఠి, బెల్లం కలిపిన వెన్న, పెరుగు, మీగడ స్వామికి నైవేద్యం పెడతారు.
 
శ్రీకృష్ణాష్టమి రోజున భక్తి శ్రద్ధలతో శ్రీకృష్ణ జయంతి వ్రతంగా ఆచరిస్తే గోదానం చేసిన ఫలితంతో పాటు కురుక్షేత్రంలో సువర్ణదానం చేసిన ఫలం దక్కుతుందని బ్రహ్మాండ పురాణం చెప్తోంది. కలియుగంలో కల్మషాల్ని హరించి, పుణ్యాల్ని ప్రసాదించే పర్వదినం శ్రీకృష్ణాష్టమి. కృష్ణాష్టమి రోజు సూర్యోదయానికి ముందే లేచి, తలస్నానం చేసి పసుపు రంగు బట్టలు ధరించాలి. 
 
ఇంటిని శుభ్రం చేసుకుని గడపకు పసుపు కుంకుమ, గుమ్మానికి తోరణాలు, పూజ మందిరాల్లో ముగ్గులు వేయాలి. పూజకు ఉపయోగించే పటములకు పసుపు, కుంకుమ గంధం, తులసి మాల, శ్రీ కృష్ణుడి విగ్రహం, పుష్పాలతో అలంకరించుకోవాలి. పూజగదిలో ఓ మందిరంను ఏర్పాటు చేసుకుని శ్రీ కృష్ణుడు రాధతో ఉన్న ఫోటోను గానీ, ప్రతిమను కానీ ఉంచాలి. 
 
కంచు దీపంలో కొబ్బరినూనె పోసి, ఐదు దూది వత్తులతో దీపమెలిగించాలి. దీపారాధనకు ఆవునేతితో హారతి సిద్దం చేసుకోవాలి. నుదుటన సింధూరం ధరించి, తూర్పు దిక్కునకు తిరిగి ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఇంకా పూజా సమయంలో బాలకృష్ణ స్తోత్రమ్, శ్రీకృష్ణ సహస్ర నామాలు, శ్రీమత్భావగతములతో శ్రీకృష్ణున్ని స్తుతిస్తే మంచిది. ఆ తరువాత శ్రీకృష్ణునికి నైవేద్యాలు సమర్పించి, దీపారాధన గావించి పూజను ముగించాలి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు