కావలసిన పదార్థాలు : పనీర్... 400 గ్రా. పచ్చికోవా... 400 గ్రా. యాలకులపొడి... ఒక టీ. రెడ్ ఆరెంజ్ కలర్... చిటికెడు నెయ్యి... వేయించేందుకు సరిపడా పంచదార... 1 కేజీ 200 గ్రా.
తయారీ విధానం : తాజా పనీర్ను తురిమి ఓ ప్లేటులో వేసి మెత్తని పిండి ముద్దగా చేయాలి. తరువాత అందులోనే పచ్చికోవా, యాలకులపొడి, రెడ్ ఆరెంజ్ కలర్ కలిపి తగినన్ని నీళ్లు చల్లి కాస్త జారుగా జిలేబీ మిశ్రమంలా చేయాలి. స్టవ్మీద మందపాటి గిన్నె పెట్టి అందులో పంచదార వేసి ఒకటిన్నర గ్లాసు నీళ్లు కలిపి పలుచని తీగ పాకం వచ్చాక దించేయాలి.
ఇప్పుడు మందపాటి పాలిథిన్ కవరును తీసుకుని దానికి ఓ మూల చిల్లు పెట్టి అందులో జిలేబీ మిశ్రమాన్ని నింపాలి. లేదా పలుచని చేతిరుమాలుకు చిల్లు పెట్టి అందులో పిండిని నింపి అంచుల్ని బిగించి పట్టుకోవాలి. బాణలిలో నెయ్యి వేసి అందులో ఈ పిండిని గుండ్రంగా జిలేబీల్లా తిప్పుతూ వత్తాలి. వీటిని ఎర్రగా వేయించి తీసి వెంటనే పక్కనే ఉంచుకున్న పాకంలో ముంచి తీసేయాలి. అంతే పనీర్ జిలేబీలు సిద్ధమైనట్లే...! అద్భుతమైన రుచితో అలరించే ఈ జిలేబీని చిన్నారులు ఎంతో ఇష్టంగా తింటారు.