రాష్ట్రానికి తిరుగొచ్చిన కేసీఆర్.. ముగిసిన మహారాష్ట్ర పర్యటన..!

బుధవారం, 18 ఫిబ్రవరి 2015 (14:57 IST)
మహారాష్ట్ర పర్యటనకు వెళ్లిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం రాష్ట్రానికి తిరిగొచ్చారు. మంగళవారం మహారాష్ట్రకు వెళ్లిన కేసీఆర్ అక్కడ ఆ రాష్ట్ర ముఖ్య మంత్రి ఫడ్నవీస్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులు లెండి, ప్రాణహిత - చేవెళ్ల వంటి ప్రాజెక్టులపై చర్చించారు. అంతకముందు సోమవారం రోజు ఢిల్లీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో సమావేశమైన కేసీఆర్ రాష్ట్రానికి అందాల్సిన ప్రాజెక్టులు, నిధుల కేటాయింపులపై చర్చించి, విజ్ఞప్తి చేశారు. 
 
కాగా మహారాష్ట్ర రాజ్‌భవన్‌లో ఆ రాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌తో కేసీఆర్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాల మధ్య నీటి సమస్యలపై చర్చించారు. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులతోపాటు ప్రాణహిత-చేవెళ్ల, లెండి, పెన్‌గంగ ఇచ్చంపల్లి చెక్‌డ్యాంలపై చర్చించారు. ఈ సమావేశానికి మంత్రులు హరీష్ రావు, జోగురామన్న ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్‌రావు, ఇరిగేషన్ శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌కే జోషి, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లా నాయకులు హాజరయ్యారు.
 
మరోవైపు తెలంగాణ సీఎం కేసీఆర్ తన జన్మదిన వేడుకలను మహారాష్ట్ర రాజధాని ముంబైలోని రాజ్ భవన్‌లో జరుపుకున్నారు. మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు, టీఆర్ఎస్ ఎంపీలు కె. కేశవరావు, వినోద్, తెలంగాణ మంత్రులు హరీశ్ రావు, ఈటెల రాజేందర్ తదితరుల సమక్షంలో కేసీఆర్ తన బర్త్ డే కేక్‌ను కట్ చేశారు. అనంతరం దేవేంద్ర ఫడ్నవీస్‌తో భేటీ అయ్యారు.

వెబ్దునియా పై చదవండి