కాంగ్రెస్ నాయకులను తరిమికొడితేనే తెలంగాణ వస్తది: కేసీఆర్

బుధవారం, 2 మే 2012 (15:32 IST)
FILE
తెలంగాణ కోసం పార్లమెంటులో అరిచి యాగీ చేసినా ప్రధానమంత్రి కానీ, ప్రణబ్ ముఖర్జీ కానీ పట్టించుకోవడం లేదనీ, అందుకే తెలంగాణ ప్రజాక్షేత్రంలోనే వారిని ఎండగట్టేందుకు ఢిల్లీకి తిరిగి వెళుతున్నామని కేసీఆర్ అన్నారు.

కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులను తెలంగాణ ప్రాంతం నుంచి తరిమితరిమి కొట్టినపుడే తెలంగాణ రాష్ట్రం వస్తుందని అన్నారు. టీ. ఎంపీలు చేస్తున్న ప్రతిపాదనలన్నీ దిక్కుమాలిన ప్రతిపాదనలని విమర్శించారు. రాష్ట్రపతి భవన్ ముందు పెరేడ్ చేస్తే తెలంగాణ వస్తదా.. అర్థంపర్థం లేకుండా పెరేడ్ చేస్తాం.. తోక చేస్తం అంటారని మండిపడ్డారు.

వారికి దమ్ముంటే రాజీనామాలు చేసి కాంగ్రెస్ హైకమాండ్ మొఖాని గొట్టి వస్తే తెలంగాణ వస్తదన్నారు. అవన్నీ చేయకుండా ఇలాంటి పనికిమాలిన ప్రతిపాదనలతో తెలంగాణ రాదని అన్నారు. రాజీనామాలు ఇవ్వండయా అంటే పారిపోయిండ్రు.. ఇప్పుడేమో ఏదో హీరోలు లెక్కన దిక్కుమాలిన ప్రతిపాదనలు చేస్తుండ్రు.. అంటూ కేసీఆర్ ధ్వజమెత్తారు.

తెలంగాణ కాంగ్రెస్ నాయకుల చేతగానితనం వల్లనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు జాప్యం జరుగుతోందని దుయ్యబట్టారు. కేంద్రమంత్రి వాయిలార్ రవి తన వద్దకు వచ్చాడనీ, సమావేశాలు ముగిసేవరకూ ఓపిక పట్టాలని అన్నాడని కేసీఆర్ చెప్పుకొచ్చారు. అయితే ఆ మాట ప్రధానమంత్రి, హోంమంత్రి చెప్పవచ్చు కదా.. ఏం ప్రభుత్వం మీది.. అంటూ నిలదీసే సరికి నీళ్లు నములుతూ ముఖం వేళాడేసుకుని వెళ్లారన్నారు.

వెబ్దునియా పై చదవండి