తెలంగాణ రాష్ట్ర పోలీసులపై కోర్టు అసహనం వ్యక్తం చేసింది. సివిల్ కేసుల్లో ఎలా జోక్యం చేసుకుంటారంటూ ప్రశ్నించింది. పైగా, ఇంజెక్షన్ ఆర్డర్ ఉన్నప్పటికీ పోలీసులు జోక్యం చేసుకోవడంపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఈ మేరకు.. నల్గొండ జిల్లా చింతపల్లి ఎస్ఐ రామ్మూర్తికి వ్యక్తిగత హోదాలో నోటీసుల జారీచేసింది.
ప్రముఖ నటి శిల్పా చక్రవర్తికి చెందిన 32 ఎకరాల భూవివాదంపై సివిల్ కోర్టు ఇంజంక్షన్ ఉన్నా పోలీసులు జోక్యం చేసుకోవడంపై వివరణ కోరింది. నల్గొండ జిల్లా చింతపల్లి ఎస్ఐ స్సై రామ్మూర్తికి వ్యక్తిగత హోదాలో నోటీసు జారీ చేసింది. నల్గొండ జిల్లా కుర్మేడ్ గ్రామంలో కొనుగోలు చేసిన 32 ఎకరాల భూమికి సంబంధించిన వివాదంలో పోలీసుల జోక్యాన్ని సవాల్ చేస్తూ జడ కల్యాణ్ యాకయ్య, అతని భార్య టీవీ నటి శిల్పాచక్రవర్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ టి. వినోద్ కుమార్ విచారణ చేపట్టారు.
పిటిషనర్ తరపు న్యాయవాది లక్ష్మీకాంత్ వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్లు 2017లో మహమ్మద్ అబ్దుల్ అజీజ్ నుంచి కొంత భూమి కొనుగోలు చేశారని, 2019లో తనఖా డీడ్ మరికొంత భూమిపై హక్కులను పొందారన్నారు. 2017లో సివిల్ కోర్టును ఆశ్రయించి ఇంజంక్షన్ ఉత్తర్వులతోపాటు పోలీసు రక్షణ ఉత్తర్వులను పొందారన్నారు.
అయితే మహమ్మద్ అబ్దుల్ అజీజ్ కుమ్మక్కైన పోలీసులు పిటిషనర్లను వేధిస్తున్నారని, భూవివాదాన్ని సెటిల్ చేసుకోవాలంటూ ఎస్ఐ ఒత్తిడి తీసుకువస్తున్నారన్నారు. వాదనలను ఆలకించిన న్యాయమూర్తి పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని పోలీసులను ఆదేశిస్తూ విచారణను ఆగస్టు 5కు వాయిదా వేశారు.