రోడ్డుపక్కన మూత్రవిసర్జన చేస్తున్న బాలుడిని ఢీకొట్టిన కారు టైరు... షాకింగ్ ఘటన...

వరుణ్

శుక్రవారం, 26 జులై 2024 (08:44 IST)
హైదరాబాద్ నగరంలో షాకింగ్ ఘటన ఒకటి జరిగింది. రోడ్డు పక్కన మూత్ర విసర్జన చేస్తున్న ఆరేళ్ల బాలుడిని ఎక్కడ నుంచో వచ్చిన కారు టైరు ఒకటి ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడిన ఆ బాలుడుని కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. అమీన్‌పూర్ పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. సందీప్ రెడ్డి అనే వ్యక్తి అమీన్‌పూర్ మండలం, పటేల్‌గూడలో కుటుంబంతో కలిసి నివసిస్తుంటారు. ఆదివారం ఆయన స్థానిక డాబాలో భోజనం చేసేందుకు కుటుంబ సభ్యులతో కలిసి కారులో బయలుదేరారు. 
 
మార్గమధ్యంలో ఆయన కుమారుడు ఆరేళ్ల మోక్షిత్ రెడ్డికి మూత్ర విసర్జన రావడంతో కారును రోడ్డు పక్కన ఆపాడు. కారు దిగిన బాలుడు.. ఓఆర్ఆర్ పక్కన చేస్తుండగా ఎక్కడి నుంచో అమితవేగంతో దొర్లుకుంటూ వచ్చిన కారు టైరు బాలుడిని ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయాలపాలైన బాలుడిని తల్లిదండ్రులు హుటాహుటిన ముత్తంగిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం మరో ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం కన్నుమూశాడు. ఓఆర్ఆర్‌పై ఏదైనా కారు టైరు ఊడిపోయి వేగంగా వచ్చి బాలుడిని ఢీకొట్టి ఉండొచ్చనచి పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు