పెళ్లయిన ఆరు నెలలకే వేధింపులు - కేబుల్ బ్రిడ్జిపై నుంచి దూకి టెక్కీ ఆత్మహత్య

ఠాగూర్

శుక్రవారం, 20 జూన్ 2025 (08:47 IST)
హైదరాబాగ్ నగరంలోని దుర్గం చెరువు కేబుల్ వంతెనపై నుంచి దూకి ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న కేసులోని మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఆరు నెలల క్రితమే వివాహమైన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను అదనపు కట్నం కోసం అత్తంటివారి ఒత్తిడి చేయడం వల్లే ఈ దారుణానికి పాల్పడినట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. మృతురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు విచారణ చేపట్టారు. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఈస్ట్ మారేడ్‌పల్ల, అడ్డగుట్ట ప్రాంతానికి చెందిన అంజయ్య, సుశీల దంపతులకు సుష్మ (27) అనే కుమార్తె ఉండగా, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నారు. సుష్మకు నేరేడ్‌మెట్‌కు చెందిన గొల్లూరు ఆనంద్, పాలిన దంపతుల కుమారుడు అమృత్‌తో ఈ ఏడాది జనవరి 31న వివాహం జరిపించారు. అమృత్ కూడా సాఫ్ట్‌వేర్ ఇంజనీరే. వివాహ సమయంలో సుష్మ తల్లిదండ్రులు రూ.5 లక్షల నగదు, 6 తులాల బంగారం, ఒక రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌ను కట్నకానుకలుగా ఇచ్చారు. 
 
వివాహం జరిగిన కొన్నాళ్లకే అదనపు కట్నం తేవాలంటూ సుష్మను ఆమె భర్త అమృత్, అత్త పాలిన, మామ ఆనంద్, మరిది కలిసి వేధించడం మొదలుపెట్టారని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపించారు. అనారోగ్యంతో బాధపడుతున్న సుష్మను ఈ నెల 13న ఆసుపత్రిలో చేర్పించగా, 16న డిశ్చార్జ్ అయింది. అనంతరం ఆమెను తల్లిదండ్రులు తమ ఇంటికి తీసుకెళ్లారు.
 
మరుసటి రోజైన 17వ తేదీన తన ల్యాప్‌టాప్‌ తెచ్చుకోవడానికి సుష్మ తండ్రి అంజయ్యతో కలిసి అత్తగారింటికి వెళ్లింది. అక్కడ మళ్లీ ఎందుకు వచ్చావ్ అంటూ భర్త, అత్తమామలు సుష్మను సూటిపోటి మాటలతో వేధించారని, అదనపు కట్నం తీసుకురావాలంటూ తండ్రి అంజయ్యను కూడా దూషించారని తెలిసింది. దీంతో సుష్మ తీవ్ర మనస్తాపానికి గురైంది. దీంతో బుధవారం మధ్యాహ్నం సుష్మ ఆఫీసుకు వెళ్లింది. రాత్రి ఒంటి గంటయినా ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన తండ్రి అంజయ్య, ఆమె పనిచేస్తున్న కంపెనీ మేనేజర్‌కు ఫోన్ చేశారు. 
 
సుష్మ రాత్రి 8:30 గంటల సమయంలోనే ఆఫీసు నుంచి వెళ్లిపోయిందని మేనేజర్ తెలిపారు. దీంతో కంగారుపడిన తల్లిదండ్రులు తెలిసినచోట్ల వెతికారు. ఆచూకీ లభించకపోవడంతో నిన్న తెల్లవారుజామున 4 గంటలకు మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. గురువారం ఉదయం 7:30 గంటల సమయంలో దుర్గం చెరువులో ఓ మహిళ మృతదేహం తేలుతుందని స్థానికుల నుంచి పోలీసులకు సమాచారం అందింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, మృతదేహాన్ని పరిశీలించి అది సుష్మదేనని గుర్తించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు