పదవి పోయినా ఫర్లేదు.. బెల్టు షాపులు మాత్రం ఉండటానికి వీల్లేదు : కాంగ్రెస్ ఎమ్మెల్యే

మంగళవారం, 26 డిశెంబరు 2023 (09:29 IST)
తన ఎమ్మెల్యే పదవిపోయినా ఫర్లేదని, కానీ తన నియోజకవర్గంతో పాటు రాష్ట్రంలో ఎక్కడా బెల్టు షాపులు ఉండటానికి వీల్లేదని మునుగోడు శాసనసభ సభ్యుడు, కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఆయన తన క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ, గత కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రంలో విచ్చలవిడిగా బెల్టు షాపులు తెరిచేందుకు అనుమతి ఇచ్చిందన్నారు. ఫలితంగా రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతుందని, ఈ కారణంగా అనేక కుటుంబాలు చెల్లాచెదురై పోతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో మంది యువత మద్యానికి బానిసలై పోతున్నారన్నారు. అందువల్ల ఇపుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందని, ఈ బెల్టు షాపులను మూసివేయాలని ఆయన కోరారు. ఈ విషయంలో తన పదవిపోయినా ఫర్లేదని, బెల్టు దుకాణాలు మాత్రం మూయాల్సిందేనని స్పష్టం చేశారు. 
 
తన క్యాంపు కార్యాలయంలో 26 గ్రామాల ముఖ్య నాయకులతో బెల్టు షాపుల మూసివేత, గ్రామాల అభివృద్ధిపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... బెల్టు షాపుల విషయంలో తాను చాలా సీరియస్‌గా ఉంటానని వారికి హామీ ఇచ్చారు. తాగుడు వల్ల ఎన్నో కుటుంబాలు నాశనమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మద్యం ఎక్కడపడితే అక్కడ దొరకడం వల్ల యువత తాగుడుకు బానిసలుగా మారుతున్నారని వ్యాఖ్యానించారు. 
 
చట్ట ప్రకారం బెల్టు షాపులు ఉండరాదన్నారు. బెల్టు షాపులను బంద్ చేయాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. ఈ అంశం రాజకీయాలతో సంబంధం లేనిదని తేల్చి చెప్పారు. తాను మరోసారి చెబుతున్నానని.. తన పదవి పోయినా ఫర్వాలేదు కానీ బెల్టు షాపులు మాత్రం మూయాల్సిందే అన్నారు. ఇది గ్రామాల్లోని ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. 2014కు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు గ్రామాల్లో బెల్టు షాపులు లేవని.. బీఆర్ఎస్ వచ్చాక విచ్చలవిడిగా తయారయ్యాయన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు