మాది పీపుల్స్ ప్రభుత్వం... పూర్తిగా ప్రజలకు అంకితం : తెలంగాణ మంత్రులు

ఆదివారం, 10 డిశెంబరు 2023 (19:51 IST)
తమది పీపుల్స్ ప్రభుత్వమని, పూర్తిగా ప్రజలకు అంకితమని తెలంగాణ మంత్రులు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. వారు ఆదివారం ఖమ్మం కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. సంపద సృష్టించి ప్రజలకు పంచడమే ప్రజా ప్రభుత్వం ప్రధానమైన ఏజెండా అని మంత్రులు తెలిపారు. ప్రజల కోసమే ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే రెండు గ్యారెంటీలు అమలు చేశామని, వంద రోజుల్లో  మిగతా నాలుగు గ్యారంటీలు అమలు చేస్తామన్నారు. 
 
ప్రజా ప్రభుత్వంలో ప్రతి వ్యవస్థ, ప్రతి సంస్థ ప్రజల కోసం పనిచేస్తుందని, ఈ పీపుల్స్ ప్రభుత్వాన్ని పూర్తిగా ప్రజలకు అంకితమన్నారు. అసెంబ్లీలో పండుగ వాతావరణంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారెంటీల్లో రెండు గ్యారెంటీలకు శ్రీకారం చుట్టామని, మహిళా సాధికారతకు తొలి అడుగుగా రాష్ట్రంలోని మహిళలందరికీ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ప్రారంభించినట్టు వెల్లడించారు. 
 
రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబానికి రాజీవ్ ఆరోగ్యశ్రీ సాయాన్ని పది లక్షల రూపాయలకు పెంచుతూ అందించే గ్యారెంటీని ప్రారంభించామని, కాంగ్రెస్ ఇచ్చిన గ్యారెంటీలకు వారంటీ లేదని ఎద్దేవా చేసిన భారత రాష్ట్ర సమితి నాయకులకు చెంపపెట్టులాగా.. బాధ్యత తీసుకున్న రెండు రోజుల్లోనే రాజీవ్ ఆరోగ్యశ్రీ, ఉచిత బస్సు హామీలను అమలు చేశామని గుర్తు చేశారు. 
 
రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న గృహాల సమస్య, పోడు భూములు, ఇతర సమస్యలను పరిష్కరిస్తామన్నారు. జర్నలిస్టులకు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోని ఇంటి స్థలాలు ఇచ్చామని వెల్లడించారు. 
 
బీఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాలుగా జర్నలిస్టులకు ఇంటి స్థలాలు ఇచ్చే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిందని, జర్నలిస్టుల ఇండ్ల సమస్య పరిష్కారానికి కోర్టు అనుమతులు ఇచ్చినప్పటికీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఇబ్బందులు పెట్టిందని వారు ఆరోపించారు. 
 
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 అసెంబ్లీ స్థానాలకుగాను 9 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి గెలిపించిన జిల్లా ప్రజలకు కృతజ్ఞతలని, ప్రజా ప్రభుత్వం ఏర్పాటుకు కాంగ్రెస్ పార్టీకి అమూల్యమైన ఓట్లు వేసిన ఓటర్లకు ధన్యవాదాలని మంత్రులు చెప్పారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు