టీఆర్ఎస్ నేత తాటి వెంకటేశ్వర్లు కుమార్తె ఆత్మహత్య

గురువారం, 14 ఏప్రియల్ 2022 (12:31 IST)
టీఆర్ఎస్ నేత, అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు కుమార్తె తాటి మహాలక్ష్మి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దీంతో వారి ఇల్లు శోక సముద్రంలో మునిగిపోయింది. బుధవారం మహాలక్ష్మి తన గదిలోనే ఉరివేసుకుందని తెలిసిన వెంకటేశ్వర్లు గుండెలు ఒక్కసారిగా ఆగిపోయినంత పని అయ్యింది.
 
బాగా ఎండెక్కినా కూతురు మహాలక్ష్మి ఇంకా తన గది తలుపులను తెరవకపోవడంతో కుటుంబ సభ్యులు తలుపులు తట్టి పిలిచారు. కానీ లోపలినుంచి ఎటువంటి స్పందనా రాలేదు. దీంతో పదే పదే తలుపులు బాదినా కూతురు నుంచి ఎటువంటి స్పందనా రాకపోవటంతో తలుపులు పగలగొట్టి గదిలోకి వెళ్లారు. లోపల కనిపించిన దృశ్యం చూసి నిర్ఘాంతపోయారు.
 
మహాలక్ష్మి గదిలో ఉరికి వేలాడుతూ కనిపించడంతో షాకయ్యారు. వెంటనే ఆమెను కిందికి దించి భద్రాచలంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. కానీ..అప్పటికే ఆమె మృతి చెందినట్టు డాక్టర్లు నిర్ధారించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
 
విషయం తెలిసిన తాటి వెంకటేశ్వర్లు వెంటనే భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు. కుమార్తె మృతదేహాన్ని చూసి గుండెలవిసేలా రోదించారు. ఆమె ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 
 
కాగా, ఎంబీబీఎస్ పూర్తి చేసిన మహాలక్ష్మి ప్రస్తుతం పీజీ కోసం సన్నద్ధమవుతున్నారు. ఇంతలోనే ఏమైందోగానీ ఆమె ఆత్మహత్యకు పాల్పడటంతో వారి కుటుంబం అంతా శోకసముద్రంలో మునిగిపోయింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు