కోలాహలంగా బన్ని ఉత్సవం.. రక్తసిక్తమైన దేవరగట్టు - యువకుడు మృతి

బుధవారం, 25 అక్టోబరు 2023 (09:41 IST)
తెలంగాణ రాష్ట్రంలోని దేవరగట్టులో ప్రతి యేటా బన్ని ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తుంటారు. అలాగే, ఈ యేడాది కూడా మాళ మల్లేశ్వర స్వామి విగ్రహార కోసం కర్రల సమరం జరిగింది. ఈ కర్రల సాములో పలువురు గాయపడ్డారు. అయితే, ప్రమాదవశాత్తు చెట్టుమీద నుంచి పడిన ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. 
 
బన్నీ ఉత్సవాల్లో భాగంగా మాళ మల్లేశ్వర స్వామి విగ్రహాలను దక్కించుకునేందుకు దేవరగుట్టకు చెందిన రెండు వర్గాల ప్రజలు ఒకరిపై ఒకరు కర్రలతో కొట్టుకున్నారు. దీంతో పలువురు భక్తులు గాయపడ్డారు. కొందరి తలలు పగిలాయి. నెరణికి, నెరణికితండా, కొత్తకోట, సులువాయి, ఆలూరు, బిలేహాలు, విరుపాపురంత గ్రామాలకు చెందిన ప్రజలు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ వేడుకలకు ముందస్తు అనుమతి తీసుకోవడంతో పోలీసు యంత్రాంగం సీసీ కెమెరాల ద్వారా ఈ కర్రల సమరాన్ని పరిశీలించారు.
 
ఇదిలావుంటే, దేవరగట్టు బన్నీ ఉత్సవాలలో ఈ ఏడాది అపశృతి జరిగింది. ఉత్సవాన్ని వీక్షిస్తున్న సమయంలో సింహాసనం కట్ట వద్ద ఉన్న వేప చెట్టుపైకి భక్తులు ఎక్కారు. ఎక్కువ మంది ఎక్కడంతో చెట్టు కొమ్మ విరిగిపోయింది. దీంతో చెట్టు మీద నుంచి పలువురు భక్తులు కిందపడ్డారు. ఈ ప్రమాదంలో ఆలూరుకు చెందిన గణేష్ అనే ఇంటర్ విద్యార్థి మృతి చెందాడు. హుటాహుటిన హాస్పిటల్‌కు తరలించినప్పటికీ గాయం తీవ్రత కారణంగా చనిపోయాడు. ఈ ప్రమాదంలో మరికొందరికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని హాస్పిటల్కు తీసుకెళ్లి చికిత్స అందించారు.
 
కాగా, కర్రలు లేకుండా ఉత్సవం జరిపించాలని ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా కలెక్టరు, ఎస్పీ ప్రయత్నించారు. వివిధ కార్యక్రమాలు చేపట్టారు. అయినా ప్రయోజనం లేకపోయింది. విజయదశమి పర్వదినాన ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాల సరిహద్దులోని పవిత్ర ఆధ్యాత్మిక క్షేత్రం దేవరగట్టుకు భక్తులు చేరుకున్నారు. దాదాపు అరగంటపాటు బన్ని ఉత్సవం కొనసాగింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు