మేడిగడ్డ వద్ద కుంగిన లక్ష్మీ బ్యారేజ్ పిల్లర్ : కాంగ్రెస్ ప్రచారాస్త్రం

ఆదివారం, 22 అక్టోబరు 2023 (19:07 IST)
తెలంగాణాలో మేడిగడ్డ వద్ద లక్ష్మీ బ్యారేజ్ పిల్లర్ కుంగిపోయిన ఘటనపై తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో స్పందించారు. కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులో భాగమైన లక్ష్మీ బ్యారేజ్ వద్ద పిల్లర్ కుంగిపోవడానికి కారణం కేసీఆర్ కుటుంబమేనని ఆరోపించారు. కాళేశ్వరం అవినీతిలో మొదటి దోషి కేసీఆర్ కుటుంబం అని విమర్శించారు.
 
నాణ్యతా లోపంతోనే మేడిగడ్డ ప్రమాదం చోటు చేసుకుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.1 లక్ష కోట్లను కేసీఆర్, కాంట్రాక్టర్లు దోచుకున్నారని రేవంత్ మండిపడ్డారు. మేడిగడ్డ బ్యారేజ్ కుంగడంపై సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్‌తో దర్యాప్తు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోందని వెల్లడించారు. మేడిగడ్డ ఘటనపై కేంద్ర హోంమంత్రి, గవర్నర్, ఈసీ విచారణకు ఆదేశించాలని కోరారు. మేడిగడ్డకు వెళ్లేందుకు ఈసీకి లేఖ రాస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు. కేటీఆర్, హరీశ్ రావు కూడా తమతో కలిసి మేడిగడ్డకు రావాలని డిమాండ్ చేశారు.
 
ఇదిలావుంటే, వచ్చే నెలలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావాలని తపిస్తున్న బీఆర్ఎస్‌కు ఈ ప్రాజెక్టు కుంగుబాటు ఓ ప్రతిబంధకంగా మారనుంది. దాదాపు లక్ష కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని చూపించి ఎన్నికలకు వెళ్తున్న అధికార పార్టీకి ఇప్పుడు అదే సమస్యగా మారింది. 
 
కాళేశ్వరం ప్రాజెక్టులో లోపాలున్నాయని, కమిషన్ల కోసమే దానిని నిర్మించారంటూ విపక్షాలు చేస్తున్న ఆరోపణలకు బలం చేకూర్చేలా గత రాత్రి కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ వద్ద లక్ష్మీ బ్యారేజీ పిల్లర్ కుంగిపోయింది. దీంతో అప్రమత్తమైన అధికారులు దాని పైనుంచి రాకపోకలు నిలిపివేశారు. ఇప్పుడిది ప్రతిక్షాలకు అస్త్రమైంది. 
 
తాజాగా కాంగ్రెస్ నేత, కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ట్విట్టర్ వేదికగా సీఎం కేసీఆర్‌పై విమర్శల వర్షం కురిపించారు. కమీషన్ల కాళేశ్వరంలో లోపాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయని పేర్కొన్నారు. తన డ్రీమ్ ప్రాజెక్టుగా చెబుతూ ఆగమేఘాల మీద కేసీఆర్ కమీషన్లకు తలుపులు తెరిచి కట్టించిన కాళేశ్వరంలో నాణ్యత ఎక్కడని ప్రశ్నించారు. నాడు ఒక్క వర్షానికే మోటార్లు పడిపోతే నేడు ఏకంగా వంతెనే కుంగిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజల సొమ్మును కాజేసిన కల్వకుంట్ల కుటుంబాన్ని తెలంగాణ ప్రజానీకం క్షమించబోదని పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు