రేపే మోడీ ప్రమాణ స్వీకారం... కిషన్ రెడ్డికి అవకాశం ఉంటుందా?

బుధవారం, 29 మే 2019 (14:19 IST)
రేపు సాయంత్రం మోడీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మోడీతో పాటు మరికొందరు నేతలు కూడా మంత్రులుగా ప్రమాణం చేస్తున్నారు. ఇప్పటికే మంత్రివర్గ కూర్పుపై నిన్న మోడీ, అమిత్ షా కసరత్తు చేశారు. సొంత పార్టీ నుంచి ఎవరికి అవకాశం కల్పించాలి, మిత్రపక్షాలకు ఏయే శాఖలు కేటాయించాలి అనే అంశంపై ఓ నిర్ణయానికి వచ్చారు ఇరువురు నేతలు.
 
అయితే అనూహ్యంగా తెలంగాణ రాష్ట్రంలో నాలుగు పార్లమెంట్ స్థానాలు కమలం పార్టీ గెలుచుకున్న నేపథ్యంలో మంత్రివర్గంలో తెలంగాణాకు  ప్రాతినిధ్యం ఉంటుందా? అనే అంశంపై తెలంగాణ నేతల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొని ఉంది. ఆశావాహలు అందరూ ఢిల్లీ పిలుపు కోసం ఎదురుచూస్తున్నారు. తెలంగాణ ఎంపీలకు మొదటి విడతలో స్థానం ఉంటుందా? ఉంటే ఎవరికి ఛాన్స్ అనే దానిపై తెలంగాణ బీజేపీలో తీవ్ర చర్చ జరుగుతుంది. 
 
తెలంగాణ భారతీయ జనతాపార్టీ మాజీ అధ్యక్షుడు, సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి గెలుపొందిన కిషన్ రెడ్డికి అవకాశాలు మెండుగా ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది. రానున్న రోజుల్లో బీజేపీ తెలంగాణాలో బలీయమైన శక్తిగా ఎదగడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్న సమయంలో మంత్రివర్గంలో స్థానం కల్పిస్తే పార్టీ నిర్మాణానికి మంచి అవకాశాలు ఉంటాయంటున్నారు బీజేపీ నేతలు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు