జగన్ కేబినెట్‌లో కలెక్షన్ కింగ్... కీలక శాఖ ఖాయం...

మంగళవారం, 28 మే 2019 (20:13 IST)
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రిగా మే 30న ప్రమాణం చేస్తున్న సంగతి తెలిసిందే. ఐతే ఆయన కేబినెట్లో ఎవరెవరు మంత్రులుగా వుంటారన్నదానిపై ఊహాగానాలు గత రెండురోజులుగా సాగుతున్నాయి. అంబటి రాంబాబు, ఆర్కే రోజాతో పాటు మరికొందరు పేర్లు వినిపిస్తున్నాయి. ఐతే తాజాగా కలెక్షన్ కింగ్ మోహన్ బాబు పేరు ప్రచారంలోకి వచ్చింది.
 
మోహన్ బాబు ఇటీవలే వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. జగన్ మోహన్ రెడ్డికి మద్దతుగా పర్యటనలు కూడా చేశారు. పైగా తిరుపతిలోని ఆయన విద్యాసంస్థలలో విద్యార్థులకు ఫీజ్ రీయెంబర్స్ పైన ఆందోళన చేసిన సమయంలో చంద్రబాబు నాయుడుపై భారీ విమర్శలు చేయడమే కాకుండా... తెదేపా జెండా దొంగిలించుకెళ్లావంటూ మండిపడ్డారు. ఇదిలావుండగానే మొన్నటి ఎన్నికల్లో తెదేపా ఘోర పరాజయం పాలైంది. 
 
ఇపుడు వైసీపీ కోసం పనిచేసిన నాయకుల్లో సీనియర్ నాయకులకు మంత్రి పదవులు వరిస్తాయని అంటున్నారు. ఇందులో భాగంగా మోహన్ బాబుకి కీలక మంత్రి పదవి వచ్చే ఛాన్స్ వుందంటున్నారు. దీనికి కారణం... విశాఖ శ్రీ శారదా పీఠం ఆధ్వర్యంలో మోహన్ బాబు పనిచేస్తున్న ఫిలిం నగర్ దైవ సన్నిధానం వుంది. ఐతే దానకీ దీనికీ లింకేంటి అనుకుంటున్నారా... వుంది. ఎందుకంటే జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి రావాలంటూ పలు యాగాలు చేశారు విశాఖ శ్రీ శారదా పీఠం స్వామీజీ.
 
ఇప్పుడు ఆ స్వామిజి సలహాల మేరకు మోహన్ బాబుకి జగన్ మంత్రి పదవి ఇవ్వాలన్న ఆలోచనలో వున్నట్లు సమాచారం. మరోవైపు పార్టీ కోసం అహర్నిశలు పనిచేసిన మరికొంతమంది నాయకులకు కూడా కీలకమైన నామినేటెడ్ పదవులను కట్టబెట్టాలని జగన్ మోహన్ రెడ్డి వున్నారు. ఇందులో తితిదే ఛైర్మన్ పదవి కూడా వుంది. మరి ఈ పదవిని ఎవరికి కట్టబెడతారో చూడాలి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు