పిల్లి కనిపించట్లేదు... తిండి మానేసిన ఫ్యామిలీ.. స్కూలుకు వెళ్లని కిడ్స్ ఎక్కడ?

శుక్రవారం, 8 అక్టోబరు 2021 (23:01 IST)
పెంపుడు పిల్లి కోసం ఆ కుటుంబం నానా తంటాలు పడింది.  తాము పెంచుకునే పిల్లి కనిపించకుండా పోవడంతో ఏకంగా పెద్దలైతే భోజనం మానేయగా పిల్లలు కనీసం స్కూలుకు కూడా పోలేని పరిస్థితిలో ఉన్నారు.
 
వివరాల్లోకి వెళితే..యాదాద్రి భువనగిరి జిల్లాలోని గౌరాయిపల్లె గ్రామానికి చెందిన గుజ్జుల రాంచంద్రారెడ్డి కుటుంబం గత ఏడు నెలల క్రితం తన బంధువుల ఇంట్లో ఉండే రెండు రోజుల పిల్లిని తెచ్చుకుని పెంచుకుంటున్నారు. కాగా ఆ పిల్లి చూడ్డానికి చాలా అందంగా ఉండడంతో పాటు నలుపు, తెలుపు, చారాలతో మెరిసిపోతుంది. దీంతో ఆ పిల్లితో ఇంట్లో వారికి మంచి బంధం ఏర్పడింది. వారితో ఆడుతూ పిల్లలకు టైంపాస్‌గా మారింది.
 
అయితే గత పదిరోజుల క్రితం అకస్మాత్తుగా పిల్లి కనిపించకుండా పోయింది. బయట ఉందనుకున్న పిల్లి ఇంట్లోకి రాకపోవడంతో కంగారు పడిన కుటుంబ సభ్యులు, పిల్లి కోసం ఊరంతా వెతికారు. ఆ ఊళ్లోనే కాదు పక్క ఊళ్లో కూడా పిల్లి కోసం ఆరా తీశారు. ఫలితం లేకపోవడంతో పిల్లిపై బెంగ పెట్టుకున్న రాంచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు తిండి కూడా తినడం మానేశారు. ఇక ఆయన ఇద్దరు పిల్లలైతే స్కూలుకు పోవడానికి కూడా ఇష్టపడడం లేదు.
 
 
దీంతో పిల్లిని ఎవరో కిడ్నాప్ చేసినట్టు అనుమానాలు వ్యక్తం చేసిన రాంచంద్రారెడ్డి స్థానిక యాదాద్రి పోలీసుకు ఫిర్యాదు చేశాడు. ఎవరో కావాలనే పిల్లిని తీసుకువెళ్లినట్టు అనుమానాలు ఉన్నాయని చెప్పాడు. పిల్లిని అపహరించిన వారిని పట్టుకుని చట్టప్రకారం శిక్షించాలని ఫిర్యాదులో పేర్కోన్నారు. పోలీసులు పిల్లి మిస్సింగ్‌ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు