కేసీఆర్ తెలంగాణ రైతులకు దేవుడా? ఎందుకని?

శుక్రవారం, 25 మే 2018 (21:58 IST)
భారతదేశ చరిత్రలో మరెక్కడా లేని విధంగా, ఏ రాష్ట్రంలో ఎవరూ చేయని విధంగా రైతులందరికీ 5 లక్షల రూపాయల జీవిత బీమా సౌకర్యం కల్పించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలిపారు. 
 
వ్యవసాయాభివృద్ధి, రైతుల సంక్షేమం కోసం ఎకరానికి 8వేల రూపాయల పెట్టుబడి, 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా లాంటి అనేక అద్వితీయ పథకాలు ప్రవేశ పెట్టిన తెలంగాణ ప్రభుత్వం రైతులకు జీవిత బీమా సౌకర్యంతో మరో వినూత్న పథకానికి శ్రీకారం చుట్టింది. 
 
 
ఈ ఏడాది ఆగస్టు 15న రైతులకు జీవిత బీమా పథకం ప్రారంభించి, రైతులకు బీమా సర్టిఫికెట్లు అందిస్తామని వెల్లడించారు. రైతులు ఒక్క రూపాయి కూడా ప్రీమియం కట్టాల్సిన అవసరం లేకుండా, ఎంత వ్యయమైనా సరే ప్రభుత్వమే మొత్తం ప్రీమియం చెల్లిస్తుందని వెల్లడించారు. 
 
రైతులకు జీవిత బీమా పథకానికి చెల్లించడానికయ్యే నిధులను బడ్జెట్లోనే కేటాయించి, ప్రతీ ఏటా ఆగస్టు 1 నాడే చెల్లిస్తామని వెల్లడించారు. విశ్వసనీయత, విస్తృత యంత్రాంగం కలిగిన భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన లైఫ్ ఇన్సూరెన్సు కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్.ఐ.సి.) ద్వారా ఈ బీమా పథకం అమలు చేయనున్నట్లు ప్రకటించారు. 
 
రైతు ఏ కారణంతో మరణించాడనే విషయంతో సంబంధం లేకుండా, సాధారణ మరణాలతో సహా రైతు ఎలా మరణించినా, ఆయన ప్రతిపాదించిన నామినీకి పది రోజుల్లోగా 5 లక్షల రూపాయల ప్రమాద బీమా చెల్లించే విధంగా పథకం ఉంటుందని సిఎం స్పష్టం చేశారు. కేవలం ప్రమాద బీమా మాత్రమే అయితే, ప్రభుత్వంపై వ్యయభారం కూడా తక్కువయ్యేదని, కానీ ఎంత వ్యయానికోడ్చయినా సరే మరణించిన ప్రతీ రైతు కుటుంబాన్ని ఆదుకోవడం బాధ్యతగా భావించి జీవిత బీమా చేయాలని నిర్ణయించినట్లు సిఎం వెల్లడించారు. 
 
ఇంత పెద్ద మొత్తంలో జీవితబీమా చేస్తున్నందున ఎల్.ఐ.సి. కూడా దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని, పకడ్బందీగా అమలు చేయాలని సిఎం కోరారు. కాగా ఇప్పటికే తెలంగాణ రైతులు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను దేవుడు అంటున్నారు. రైతు కష్టం తెలిసిన నాయకుడు అని కొనియాడుతున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు