నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన మంత్రి కేటీఆర్? ఇకపై నెల నెలా...

గురువారం, 28 జనవరి 2021 (17:50 IST)
తెలంగాణా రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఆ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఓ శుభవార్త చెప్పారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగులకు నిరుద్యోగ భృతిని ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలోనే ప్రకటించవచ్చని తెలిపారు. సీఎం కేసీఆర్ సారథ్యంలోని ప్రభుత్వం పేదలతో పాటు రైతులు, నిరుద్యోగులకు అండగా ఉంటుందని ఆయన చెప్పారు. 
 
గురువారం తెలంగాణ భవన్‌లో రాష్ట్ర విద్యుత్‌ కార్మిక సంఘాలతో ఆయన సమావేశమయ్యారు. ఇందులో మంత్రి కేటీఆర్ పాల్గొని మాట్లాడుతూ, సీఎం కేసీఆర్‌ త్వరలోనే నిరుద్యోగ భృతి ప్రకటించవచ్చన్నారు. ఇప్పటికే లక్ష 31 వేల ఉద్యోగాలు ఇచ్చినట్లుగా తెలిపారు. త్వరలోనే మరో 50 వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియను చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.
 
ప్రస్తుతం మన రాష్ట్రం సౌరశక్తి ఉత్పిత్తిలో రెండో స్థానంలో ఉందన్నారు. తలసరి విద్యుత్‌ వినియోగంలో తెలంగాణ మొదటి స్థానంలో ఉన్నట్లు తెలిపారు. దేశంలో పరిశ్రమలకు సరిపడా కరెంట్‌ ఇస్తున్న రాష్ట్రం ఒక్క తెలంగాణే మాత్రమేనన్నారు. అన్ని రంగాలకు నాణ్యమైన కరెంటు ఇస్తున్నట్లు చెప్పారు. విద్యుత్‌ కార్మికుల అన్ని సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. 
 
ఇకపోతే, విద్యుత్‌ ఉద్యోగుల కృషితో రాష్ట్రంలో 7 వేల మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తిని 14 వేలకు పెంచగలిగినట్లు మంత్రి కేటీఆర్‌ తెలిపారు. తెలంగాణలో ప్రస్తుతం ఎక్కడా కరెంట్‌ సమస్య లేదన్నారు. భవిష్యత్తులో ఇక కరెంట్‌ పోదని ఖచ్చితంగా చెప్పగలమన్నారు. గతంలో అన్ని రంగాలకు కరెంట్‌ సమస్య తీవ్రంగా ఉండేదన్న కేటీఆర్‌.. సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో వీటన్నింటిని అధిగమించి ముందుకెళ్తున్నట్లు మంత్రి కేటీఆర్ చెప్పుకొచ్చారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు