కోవిడ్ పేషెంట్ల వద్దకు సీఎం కేసీఆర్, చికిత్స బాగా చేస్తున్నారా అంటూ ప్రశ్న

శుక్రవారం, 21 మే 2021 (20:05 IST)
వరంగల్ పర్యటనలో భాగంగా ఎంజీఎం దవాఖానను ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ సందర్శించారు. నేరుగా కోవిడ్ పేషంట్లు ఉన్న ఐసీయూ వార్డులోకి వెళ్లి రోగులను పరామర్శించారు. కోవిడ్ పేషంట్లకు అందుతున్న చికిత్స గురించి తెలుసుకున్నారు. కరోనాకు భయపడవద్దంటూ వారికి ధైర్యం చెప్పారు.
 
ఈ సందర్భంగా వరంగల్ మట్టెవాడకు చెందిన కరోనా పేషంట్ శ్రీ వెంకటాచారి తనకు వైద్య చికిత్స బాగానే అందుతున్నదని సీఎంకు వివరించారు. ప్రతీ బెడ్ దగ్గరకూ వెళ్లి కరోనా రోగులకు అందుతున్న వైద్య సేవలను సీఎం అడిగి తెలుసుకున్నారు. అనంతరం సీఎం జనరల్ వార్డును సందర్శించి రోగులను పరామర్శించారు.
 
ఎంజీఎం ఆసుపత్రి అంతా కలియతిరిగి అక్కడి సౌకర్యాలను పరిశీలించారు. ఎంజీఎం ఆసుపత్రిలో ఉన్న వైద్య సౌకర్యాలు, రోగులకు అందుతున్న వైద్య సేవలపై డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు.
 
ఆసుపత్రిలో సిబ్బందికి ఎదురవుతున్న ఇబ్బందులను ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. ఎంత ఖర్చయినా సరే రోగులకు కావాలసిన అన్ని సౌకర్యాలను సమకూర్చాలని అక్కడే ఉన్న వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు