కాంగ్రెస్ మునిగిపోయే పడవ: కేటీఆర్

బుధవారం, 2 అక్టోబరు 2019 (16:28 IST)
కాంగ్రెస్ పార్టీ మునిగిపొతున్న పడవ అని, అలాంటి పార్టీకి ప్రజలు ఒటేయరని టియారెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు అన్నారు. ఈ రోజు హుజూర్ నగర్ టిఆర్ఎస్ పార్టీ ప్రచార ఇన్చార్జి లతో అయన టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.

హుజూర్ నగర్ నియోజకవర్గంలో ప్రచారం ఉదృతంగా సాగుతున్నదని, ప్రజల నుంచి టిఆర్ఎస్ పార్టీకి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తున్నదన్నారు. అక్కడినుంచి వస్తున్న క్షేత్ర స్థాయి రిపోర్టులు అద్భుతంగా ఉన్నాయన్నారు. తమ పార్టీ కచ్చితంగా వంద శాతం గౌరవప్రదమైన మెజార్టీతో గెలుస్తుందని తెలిపారు.

గత ఎన్నికల్లో కలిసి పోటీ చేసి ఘోర పరాభవాన్ని ఎదుర్కొన్న విపక్షాలు, ఈ రోజు ఎవరికి వారే విడివిడిగా కలబడుతున్న తీరు వాటి అనైక్యతను ప్రజలు తప్పకుండా గుర్తిస్తారన్నారు. కేంద్ర రాష్ట్రాల్లో అధికారంలో లేని కాంగ్రెస్ పార్టీ గెలుపు ద్వారా ఎలాంటి ప్రయోజనం లేదని… ప్రభుత్వంలో లేనివారు నియోజకవర్గాన్ని ఎలా అభివృద్ధి చేస్తారని స్థానిక ప్రజలు కూడా గుర్తిస్తున్నారన్నారు.

కాంగ్రెస్ పార్టీకి హుజూర్నగర్ లో ఘోర పరాజయం తప్పదని, పోటీలో ఉన్న తెలుగుదేశం పార్టీ, బీజేపీలకు ప్రజల నుంచి పెద్దగా మద్దతు ఉండకపోవచ్చని కేటీఆర్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ మరియు ఇతర పార్టీల నుంచి పెద్ద ఎత్తున నియోజకవర్గంలో టిఆర్ఎస్ లోకి చేరికలు జరుగుతున్నాయని, తెలంగాణ రాష్ట్ర సమితి హుజూర్నగర్ నియోజకవర్గంలో తొలిసారి గులాబీ జండా ఎగరెయడం ఖాయం అన్నారు.

గత ఐదు సంవత్సరాలకు పైగా టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హాయంలో హుజూర్నగర్ అభివృద్ధి జరగలేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి చేస్తున్న వాదన శుద్ధ తప్పు, పచ్చి అవాస్తవం అన్నారు. హుజూర్నగర్ లోనూ మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, రైతుబంధు, రైతు బీమా, ఆసరా పెన్షన్ లు ఇలా అన్ని రకాల ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు దిగ్విజయంగా కొనసాగుతున్నాయని వాటికి ఉత్తమ్ కూమార్ రెడ్డి చూడడం లేదన్నారు.

గత ఐదు సంవత్సరాలుగా టిఆర్ఎస్ ప్రభుత్వం నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలే ఈసారి టిఆర్ఎస్ పార్టీకి విజయాన్ని అందిస్తాయన్నారు. ప్రతిపక్ష శాసనసభ్యుడిగా ఉన్న ఉత్తంకుమార్ రెడ్డి నియోజకవర్గం పై ఎలాంటి వివక్ష చూపకుండా, రాష్ట్రంలోని అన్ని ఇతర నియోజకవర్గాలతో సమానంగా ప్రభుత్వ కార్యక్రమాలను, అభివృద్ధి పనులను చేపట్టామన్నారు.

కానీ గత ఐదు సంవత్సరాల్లో శాసనసభ్యుడిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక్కటంటే ఒక్క లేఖను తన నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రభుత్వానికి రాయలేదన్నారు. ఇదే అయనకు హుజూర్నగర్ నియోజకవర్గం పట్ల ఉత్తంకుమార్ రెడ్డి నిబద్ధతను ఎత్తి చూపుతుందన్నారు.

హుజూర్నగర్ ని అభివృద్ధి చేయలేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి చేస్తున్న అసత్య ఆరోపణలు ప్రజలు పట్టించుకోరని, గత ఐదు సంవత్సరాలుగా అన్ని రంగాల్లో నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని చూసి ప్రజలు కచ్చితంగా టిఆర్ఎస్ కే ఓటేస్తారని తెలిపారు. ఐదు సంవత్సరాలుగా తెరాస ప్రభుత్వం చేసిన అభివృద్ధిని అక్కడి ప్రజలకు వివరించాలని పార్టీ ప్రచార ఇన్చార్జీలను కేటిఆర్ కోరారు.

ప్రజలు టిఆర్ఎస్ పార్టీ పాలన పట్ల సంతృప్తిగా ఉన్నారని, ఈ పదిహేను రోజుల పాటు విస్తృతంగా ప్రచారం కొనసాగించాలని పార్టీ శ్రేణులను కోరారు. తాను స్వయంగా ఎన్నికల ప్రచారంలో పాల్గోంటానని, 4వ తేదితోపాటు పండగ తర్వతా ఒకటి, రెండు రోజులు హూజుర్ నగర్ ప్రచారంలో పాల్గొంటానని కెటియార్ తెలిపారు.

ప్రస్తుతం అక్కడ జరుగుతున్న ప్రచారశైలిని, ప్రజల స్పందనను టెలికాన్ఫరెన్సులో నాయకుల నుంచి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ పార్టీ ఎన్నికల ఇంచార్జీగా ఉన్న యంఏల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఇతర యంఏల్యేలు, యంఏల్సీలు, సీనియర్ నాయకులు కెటియార్ కు క్షేత్ర స్ధాయి ఫీడ్ బ్యాక్ అందజేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు