హైదరాబాద్‌ను కాటేస్తున్న కరోనా రక్కసి .. త్వరలో కేంద్ర బృందం

శనివారం, 25 ఏప్రియల్ 2020 (09:01 IST)
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో కరోనా వైరస్ శరవేంగావ్యాపిస్తోంది. ఒకవైపు కేంద్రం లాక్‌డౌన్ అమలు చేస్తున్నా, మరోవైపు స్థానిక ప్రభుత్వం, పోలీసులు కఠినమైన ఆంక్షలు విధించినప్పటికీ.. కొత్తగా నమోదయ్యే కేసుల సంఖ్య ఏమాత్రం తగ్గడం లేదు. దీనిపై కేంద్రం ఆందోళన చెందుతోంది. దీంతో హైదరాబాద్‌ నగర పరిశీనలకు కేంద్ర ప్రభుత్వం అంతర్‌ మంత్రిత్వ కేంద్ర బృందాన్ని (ఐఎంసీటీ) పంపించనుంది. 
 
ఇప్పటికే ఆయా రాష్ట్రాలను సందర్శించడానికి కేంద్రం ఆరు బృందాలను ఏర్పాటు చేసింది. శుక్రవారం మరో నాలుగు బృందాలను ఏర్పాటు చేసింది. ఈ నాలుగు బృందాలు హైదరాబాద్‌, చెన్నై, ఠాణే, అహ్మదాబాద్‌, సూరత్‌ నగరాల్లో పర్యటించనున్నాయని కేంద్ర హోం శాఖ సంయుక్త కార్యదర్శి పుణ్య సలీల శ్రీవాస్తవ వెల్లడించారు. ఈ బృందం క్షేత్రస్థాయిలో పర్యటించి పరిస్థితిని అంచనా వేస్తుంది. 
 
ముఖ్యంగా, లాక్‌డౌన్‌ అమలవుతున్న తీరు, కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాల అమలు, నిత్యావసర సరుకుల సరఫరా, సామాజిక దూరం పాటిస్తున్నారా లేదా?, వైద్య సదుపాయాల సన్నద్ధత, వైద్యులు, వైద్య సిబ్బందికి రక్షణ, పేద ప్రజలు, కార్మికులకు ఏర్పాటు చేసిన క్యాంపుల్లో పరిస్థితి.. తదితర అంశాలను ఈ బృందం పరిశీలిస్తుంది.
 
ఏవైనా లోపాలుంటే పరిష్కరించడానికి రాష్ట్ర అధికార యంత్రాంగానికి తగిన సూచనలు, ఆదేశాలు ఇస్తుంది. క్షేత్రస్థాయి పరిస్థితిపై కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తుంది. కేంద్రం ఇంతకుముందే ఏర్పాటు చేసిన ఆరు బృందాలు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌ పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల్లోని ఎంపిక చేసిన జిల్లాల్లో లాక్‌డౌన్‌ అమలుని, క్షేత్రస్థాయి పరిస్థితిని పరిశీలిస్తున్నాయి.
 
మధ్యప్రదేశ్‌కు వెళ్టిన బృందం అక్కడ 171 కట్టడి ప్రాంతాలను గుర్తించింది.. అందులో 20 ప్రాంతాల్లో పరిస్థితి విషమంగా ఉందని నివేదిక ఇచ్చింది. దేశంలోని పలు ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ మార్గదర్శకాలను ఉల్లంఘిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని.. ముఖ్యంగా అహ్మదాబాద్‌, సూరత్‌, ఠాణే, హైదరాబాద్‌, చెన్నైలలో పరిస్థితి తీవ్రంగా ఉందని కేంద్ర హోంశాఖ ఒక ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేసింది. తెలంగాణలోని పాజిటివ్‌ కేసుల్లో 485 కేసులు హైదరాబాద్‌లోనే నమోదైన నేపథ్యంలోనే కేంద్ర బృందం నగరానికి రానుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు