అంకుల్‌ డాడీ లేరన్న బాలిక.. తెలుసమ్మా ఓటీపీ చెప్పమని.. లక్షలు గుంజేశారు..

మంగళవారం, 16 మార్చి 2021 (10:56 IST)
హైదరాబాదులో సైబర్‌ నేరాలు పెచ్చరిల్లిపోతున్నాయి. హైదరాబాదు నగరానికి చెందిన ఓ వ్యక్తిని టార్గెట్‌ చేసిన సైబర్‌ నేరగాళ్లు బ్యాంకు ఉద్యోగుల మాదిరిగా మాట్లాడారు. కేవైసీ అప్‌డేట్‌ పేరుతో ఆయన డెబిట్‌ కార్డుకు సంబంధించిన వివరాలు సంగ్రహించారు. ఓటీపీల కోసం నేరగాళ్లు కాల్‌ చేసే సమయానికి ఆయన తన ఫోన్‌ ఇంట్లో వదిలి బయటకు వెళ్లారు. అదే సమయంలో ఆన్‌లైన్‌ క్లాస్‌లు వింటోన్న ఆయన కుమార్తె (ఐదో తరగతి విద్యార్థిని) ఆ కాల్‌ అందుకుంది. 
 
'అంకుల్‌ డాడీ లేరు... బయటకు వెళ్లారు..' అని చెప్పి ఫోన్‌ పెట్టేయడానికి ప్రయత్నించింది. ఈలోపు సైబర్‌ నేరగాళ్లు 'తెలుసమ్మా... ఆ ఫోన్‌కు ఓటీపీలు వస్తాయి చెప్పమ్మా' అంటూ హిందీలో సంభాషించారు. ఇలా రెండుసార్లు ఆమె నుంచి ఓటీపీలు తీసుకుని బాధితుడి బ్యాంకు ఖాతా నుంచి రూ.32 వేలు కాజేశారు. మరో ఉదంతంలో బ్యాంకు అధికారుల మాదిరిగానే మూసారాంబాగ్‌కు చెందిన ఓ వ్యక్తికి కాల్‌ చేసిన సైబర్‌నేరగాళ్లు రూ.1.15 లక్షలు కాజేశారు. 
 
వివిధ కారణాలతో కొన్ని సంస్థల కస్టమర్‌ కేర్‌ నెంబర్ల కోసం ప్రయత్నించిన ఇద్దరు నగర వాసులు ఇంటర్‌నెట్‌లో ఉన్న నకిలీ నెంబర్లకు కాల్‌ చేశారు. అవతలి వారు చెప్పినట్లే చేసి తమ ఖాతాల్లోని రూ.81 వేలు, రూ.96 వేలు పోగొట్టుకున్నారు. 
 
మరో ఉదంతంలో ఓఎల్‌ఎక్స్‌లో ఉన్న వాహన విక్రయ ప్రకటన చూసిన నగర వాసి అందులోని నెంబర్లో సంప్రదించాడు. ఆర్మీ అధికారిగా చెప్పుకున్న సైబర్‌ నేరగాడు అడ్వాన్స్‌ సహా వివిధ పేర్లతో రూ.4 లక్షలు కాజేశాడు. ఈ మేరకు కేసులు నమోదు చేసుకున్న సైబర్‌ క్రైమ్‌ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు