బల్దియా పోరులో చిత్ర విచిత్రాలు : ఎమ్మెల్యే భార్య ఓటమి.. మేయర్ సతీమణి గెలుపు

శుక్రవారం, 4 డిశెంబరు 2020 (20:57 IST)
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలు శుక్రవారం వెలువడ్డాయి. ఈ ఫలితాలు ఆసక్తికరంగా ఉన్నాయి. అధికార తెరాస దూకుడుకు భారతీయ జనతా పార్టీ బ్రేకులు వేసింది. పాతబస్తీలో ఎంఐఎం ఎప్పటిలానే తన సత్తా చాటింది. ఇక కాంగ్రెస్, ఇతర పార్టీలు పత్తాలేకుండా పోయాయి. ఇదిలావుంటే, ఇప్పటివరకు వెల్లడైన ఫలితాలు ఆసక్తికరంగా ఉన్నాయి. 
 
ముఖ్యంగా, ఉప్పల్ తెరాస ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి భార్య స్వప్న ఓటమి చవిచూశారు. స్వప్న హబ్సీగూడ డివిజన్‌లో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేశారు. అయితే, ఎమ్మెల్యే అర్ధాంగికి బీజేపీ అభ్యర్థి షాకిచ్చింది. 
 
హబ్సీగూడలో బీజేపీ అభ్యర్థి చేతన విజయం సాధించింది. అటు, నగర మేయర్ బొంతు రామ్మోహన్ భార్య శ్రీదేవి యాదవ్ చర్లపల్లి డివిజనులో జయభేరి మోగించారు. శ్రీదేవి యాదవ్ తన ప్రత్యర్థి సురేందర్ గౌడ్ (బీజేపీ)పై నెగ్గారు. 
 
కాగా, జీహెచ్ఎంసీ ఎన్నికల కౌంటింగ్‌పై తాజా సమాచారం ప్రకారం... తెరాస ఇప్పటివరకు 56 డివిజన్లను కైవసం చేసుకుంది. అలాగే, బీజేపీ 49 చోట్ల, కాంగ్రెస్ పార్టీ 2 చోట్ల, ఎంఐఎం 43 సీట్లలో విజయభేరీ మోగించాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు