భారీ వర్షంతో వరద నీటిలో గల్లంతైన బంగారు ఆభరణాలు

మంగళవారం, 13 అక్టోబరు 2020 (12:00 IST)
రెండు రోజుల నుంచి హైదరాబాద్ నగరంలో కురుస్తున్న  వర్షాలకు నగరం అంతా జలమయం అయ్యింది. ఎడ తెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నగరంలో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలలో ఇళ్లలోనికి నీరు వచ్చి చేరుతున్నాయి. అదేవిధంగా నగరంలోని రోడ్లన్నీ వరద నీటితో చెరువులను తలపిస్తున్నాయి. దీంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలగడం మాత్రమే కాదు కొన్ని వాహనాలు, చిన్నచిన్న వస్తువులు నీటిలో కొట్టుకోపోతున్నా యి.
 
ఈ క్రమంలోనే బంగారు ఆభరణాలు కూడా వరద నీటిలో గల్లంతయ్యాయి. ఓ వ్యక్తి బ్యాగు నీటిలో పడిపోవడంతో అవి కొట్టుకుపోయాయి. వివరాలు ఇలా వున్నాయి. జూబ్లీ హిల్స్ లోని కృష్ణ పెరల్స్ దుకాణానికి బషీర్ బాగ్ లోని వీఎస్ గోల్డ్ దుకాణాదారుడు సేల్స్‌మెన్ ప్రదీప్‌కు కిలోన్నర బంగారం ఆభరణాలను ఇచ్చి శనివారం ఉదయం పంపారు.
 
కొనుగోలుదారుడు ఆభరణాలను కొన్న తర్వాత అదే రోజు సాయంత్రం సేల్స్‌మెన్ ప్రదీప్ మళ్లీ ఆ ఆభరణాల సంచి తీసుకొని బైక్ పైన బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 3 మీదుగా బషీర్ బాగ్‌కు వర్షంలోనే బయల్దేరాడు. రోడ్డులో వెళ్తుండగా వరద నీరు ఎక్కువ రావడంతో కిందపడటంతో తన చేతిలో ఉన్న ఆభరణాల బ్యాగు పడిపోయింది. దీంతో వరదలో కొన్ని ఆభలణాలు కొట్టుకోపోయాయి. ఈ విషయాన్ని తన యజమానికి తెలపడంతో కొంతమంది సిబ్బందితో అక్కడ వెతికారు కానీ ఫలితం లేదు. దీంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు