హైదరాబాద్ భారతదేశంలో లేదా?: బీజేపీ నేతల మీద మంత్రి కేటీఆర్ ఆగ్రహం

బుధవారం, 25 నవంబరు 2020 (05:53 IST)
హైదరాబాద్ ప్రశాంతంగా ఉంటేనే పెట్టుబడులు వస్తాయని, పిల్లలకు కొలువులు వస్తాయని ఎట్టి పరిస్థితుల్లో ఆగం అయ్యే హైదరాబాద్ ను కోరుకోవద్దన్నారు మంత్రి కేటీఆర్. కొత్తగా నిన్న మొన్న మార్కెట్లోకి వచ్చిన వారు పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారన్నారు.

హైదరాబాద్ మీద సర్జికల్ స్ట్రైక్ చేస్తామనడం పట్ల కేటీఆర్ తీవ్ర ఆగ్రహం చేశారు. హైదరాబాద్ పాకిస్తాన్ లో ఉందా అంటూ బీజేపీ నాయకులను నిలదీశారు.  ఈ రోజు ముషీరాబాద్, అంబర్ పేట లలోని గాంధీ నగర్ చౌరస్తా, రామ్ నగర్ క్రాస్ రోడ్స్, అంబర్ పెట్ అలీ కేఫ్, లింగంపల్లి చౌరస్తా క్యాచీ గూడ ల వద్ద నిర్వహించిన రోడ్ షో లలో పాల్గొని ప్రసంగించారు. 

గత ఆరేళ్లుగా ఎంతో ప్రశాంతంగా ఉంటున్నామన్నారు. ఈ ప్రశాంతతను కాపాడుకోవాల్సిన భాద్యత మన అందరిమీద ఉందన్నారు. కులం, మతం, ప్రాంతంతో నిమిత్తం లేకుండా నగర ప్రజలందరం కలిసి మెలిసి ఉంటున్నామన్నారు. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణాన్ని చెడగొట్టే కుట్రలు జరుగుతున్నాయన్నారు. మతం పేరుమీద ర్తజకీయాలు చేసే వాళ్ళ మాయలో పడొద్దని యువతకు విజ్ఞప్తి చేశారు.        
 
దేశ ప్రధాని ఇటీవల లోకల్ లోకల్ అంటున్నాడని ఈ లెక్కన తెలంగాణలో పక్కా లోకల్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ అని, హైదరాబాద్ గులాబీలు కావాలా గుజరాత్ గులాములు కావాలా నగర ప్రజలు ఆలోచించాలన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో ప్రజలను ఓట్లడుగుతున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నగర ప్రజలకు ఏం చేశారో చెప్పాలన్నారు. 

బీజేపీ నేత అమిత్  మాట్లాడుతూ తెలంగాణకు లక్ష కోట్లు ఇచ్చామన్నారు. కానీ లెక్కలోకి వెళితే తెలంగాణ ద్వారా వివిధ పన్నుల రూపంలో కేంద్రానికి వెళ్లిన సొమ్ము అక్షరాలా 2 లక్షల 72 వేల కోట్లన్నారు. తిరిగి తెలంగాణ ప్రజలకు కేవలం సగం మాత్రమే వస్తున్నాయన్నారు. ఢిల్లీ లోని బీజేపీ సర్కార్  హైదరాబాద్ కోసం చేసిన కనీసం ఒక పనిని అయినా చూపెట్టి ప్రజలను ఓట్లు అడగాలి అని కిషన్ రెడ్డి ని కేటీఆర్ నిలదీశారు.
 
కర్ణాటక,  అహ్మదాబాద్ లో వరదలు వస్తే వందల కోట్లు కేంద్రం ఇచ్చిందని కానీ హైదరాబాద్ నగరంలో వరద సాయం కోసం కేసీఆర్ గారు కేంద్రానికి ఉత్తరం రాస్తే కేంద్రం నుండి ఒక్కపైసా రాలేదన్నారు. అమ్మకు అన్నం పెట్టనోడు చిన్నమాకు గాజులు చేయించినట్లు టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న వరద సాయాన్ని ఆపిన బీజీపీ నేతలు వాళ్లకు ఓట్లేస్తే 25 వేలు ఇస్తామనడం హాస్యాస్పదమన్నారు.

వరద సాయం అందుకోని అర్హులకు డిసెంబర్ 4 వ తేదీ నుండి తిరిగి పంపిణీ ప్రారంభిస్తామని తెలియజేశారు.    పేదవారికి సహాయం చేసే దమ్మున్న నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. నగరంలో 20 వేల లీటర్ల లోపు మంచినీళ్లు వాడుకునే వాళ్లకు నల్లా చార్జీలు మాఫీ చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దన్నారు.

పేదప్రజల విషయంలో ఎంతో విశాలంగా ఆలోచించే నాయకుడు మన ముఖ్యమంత్రి కేసీఆరన్నారు. ఆరేళ్లుగా హైదరాబాద్ నగరంలో జరుగుతున్న అభివృద్ధిని కొనసాగించాలంటే గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను పెద్ద మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఐదేళ్ల కిందట మేము చేసిన విజ్ఞప్తిని మన్నించి 99 సీట్లను కట్టబెట్టిన ప్రజలు హైదరాబాద్ నగర ప్రజలు మీరు.

ఐదేళ్లలో మీరు ఇచ్చిన ఆశీర్వాదంతో నగరంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. తెలంగాణ రాకముందు హైదరాబాద్ నగరంలో మంచి నీటి సమస్య ఎలా ఉండేదో ఒకసారి ప్రజలు గుర్తుకు తెచ్చుకోవాలన్నారు. వారానికి ఒకసారి పది రోజులకు ఒకసారి మంచినీళ్లు వచ్చే పరిస్థితి.  మంచి నీటి ట్యాంకర్ల దగ్గర యుద్దాలు మనకు తెలియదా అన్నారు.

గత పాలకుల పాలనలో మంచినీరు, మురుగు నీరు కలిసి ఆ నీళ్లను తాగిన ప్రజలు ఇదే భొలాక్ పూర్ లో 9 మంది మృతి చెందిన దారుణ ఘటనలను చూశామన్నారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు లేవన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్  నాయకత్వంలో ప్రజల కనీస అవసరమైన మంచినీటి కష్టాలను తీర్చుకున్నామన్నారు. బస్తీ దావఖానాలు, కల్యాణ లక్ష్మి పథకాలతో పేద ప్రజలకు అండగా ఉంటున్నామన్నారు. 

నగరంలో గత ఆరేళ్లుగా గుడుంబా గబ్బు లేదు, పేకాట క్లబ్బు లేదు, శాంతి భద్రతలకు ఢోఖా లేదన్నారు. టీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్ నగరానికి వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయన్నారు.   
 
కరెంటు కష్టాలతో నాడు తల్లడిల్లినం.. పవర్ హాలీడేలకు వ్యతిరేకంగా నాణ్యమైన విధ్యుత్ సరఫరా చేయాలనీ ఏకంగా పారిశ్రామిక వేత్తలు ఇందిరా పార్కు వద్ద చేసిన ధర్నాలు గుర్తుచేశారు. ఇప్పుడు కేసీఆర్ పాలనలో దేశంలోనే ఎక్కడా లేనివిధంగా నిరంతరం ఎలాంటి ఆటంకం లేకుండా పవర్ హాలిడేలకు స్వస్తి పలికి నాణ్యమైన విద్యుత్ ప్రజలకు అందుబాటులోకి వచ్చిందన్నారు. 

ఒకప్పుడు కరెంటు ఉంటె వార్త. ఇప్పుడు కరెంటు పొతే వార్త అని గొప్పగా చెప్పుకునే స్థాయికి చేరుకున్నామన్నారు.  నగర ప్రజల అవసరాల పట్ల అవగాహన ఉన్న నాయకుడు కేసీఆర్ గారన్నారు. వందేండ్ల కిందట 1920లో నిర్మించిన గండిపేట జలాశయం తప్ప ఇప్పటివరకు నగర ప్రజల అవసరాల కోసం ఏ ఒక్క పాలకుడు ఆలోచించలేదు అన్నారు.

కానీ నగర ప్రజల అవసరాలు, భవిష్యత్ నగర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని దానికి రెట్టింపు సామర్థ్యంతో సీఎం కేసీఆర్ గారు కేశవాపురం రిజర్వాయర్ ని నిర్మిస్తున్నారన్నారు. 65 ఏళ్ల గబ్బు ఆరేళ్లలోపు పోతుందా ? అని గత పాలకుల వైఫల్యాలను ఎత్తి చూపారు.

ఆర్టీసీ x రోడ్ ట్రాఫిక్ కష్టాలకు చరమగీతం పాడుతూ త్వరలోనే నాలుగు వందల కోట్లతో రోడ్ల అభివృద్ధి చేపట్టినమన్నారు. త్వరలోనే రోడ్ల నిర్మాణం పనులు ప్రారంభం అవుతాయన్నారు. స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం త్వరితగతిన పూర్తి చేసుకుంటామన్నారు. హైదరాబాద్ నగరంలో  అభివృద్దిని కొనసాగించాలంటే ప్రజలంతా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు ఓటేయాలని పిలుపునిచ్చారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు