హైదరాబాద్ వర్షాలు: సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమావేశం

గురువారం, 15 అక్టోబరు 2020 (14:19 IST)
రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదలపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఈ రోజు ప్రగతిభవన్‌లో ఉన్నత స్థాయి అత్యవసర సమీక్ష నిర్వహించనున్నారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితిని చర్చిస్తారు. తీసుకుంటున్న చర్యలు, తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తారు. 
 
భారీ వర్షాలు, వరదల వల్ల జరిగిన నష్టంపై కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించాల్సి ఉన్నందున, ఈ సమావేశానికి వచ్చే అధికారులు అన్ని వివరాలు తీసుకొని రావాల్సిందిగా ముఖ్యమంత్రి ఆదేశించారు.
 
మున్సిపల్, వ్యవసాయ, ఆర్అండ్ బి, విద్యుత్ శాఖ మంత్రులు కె.టి.రామారావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, జగదీష్ రెడ్డి హైదరాబాద్ నగరానికి చెందిన మంత్రులు శ్రినివాస్ యాదవ్, మెహమూద్ అలీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, జెన్ కో సిఎండి ప్రభాకర్ రావు, ఎస్ పిడిసిఎల్ సిఎండి రఘుమారెడ్డి, మున్సిపల్ వ్యవసాయ, ఆర్ అండ్ బి శాఖల ముఖ్య కార్యదర్శులు, జిహెచ్ ఎంసి కమీషనర్, హైదరాబాద్ కలెక్టర్లను ఈ సమావేశానికి ఆహ్వానించారు.
 
ఆయా శాఖల పరిధిలో జరిగిన నష్టం వివరాలు సమావేశానికి తీసుకురావాల్సిందిగా సిఎం ఆదేశించారు. భారీ వర్షాల వల్ల తలెత్తిన పరిస్థితి, తీసుకుంటున్న పునరావాస చర్యలు, తీసుకోవాల్సిన చర్యలు, కేంద్రానికి పంపాల్సిన నివేదికలో పేర్కొనాల్సిన అంశాలు తదితర విషయాలపై సమావేశంలో సమీక్ష జరుపుతారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు