దూకగానే లోపలికి పోవడమేగానీ.. బయటకు వచ్చే పరిస్థితిలేదు... ఎక్కడ?

శుక్రవారం, 28 ఆగస్టు 2020 (15:44 IST)
భాగ్యనగరం అంటేనే మొదట గుర్తుకు వచ్చేది చార్మినార్. ఆ తర్వాత హుస్సేన్ సాగర్. హైదరాబాద్ నగరంలోకి ఎవరైనా కొత్త వారు ప్రవేసించారంటే... ఖచ్చితంగా హుస్సేన్ సాగర్ మురికి నీటి వాసనను ఇట్టే పసిగట్టేస్తారు. అలాంటి హుస్సేన్ సాగర్ ఇపుడు ఆత్మహత్యలు చేసుకునేవారికి ప్రధాన కేంద్రంగా మారింది. ఒక నెలలో కనీసం పదుల సంఖ్యలో ఇక్కడ ఆత్మహత్యాయత్నాలు జరుగుతున్నాయి. 
 
అయితే, ఇందులో దూకినవారు ఇక బతికిబయటపడే అవకాశాలు లేవు. ఎందుకంటే... ఇందులో దూకగానే లోపలికిపోవడంమేగానీ బయటకు వచ్చే పరిస్థితి లేదు. దూకిన వారిని రక్షించేందుకు ప్రయత్నించే పోలీసులకు సైతం ఇది కష్టసాధ్యంగా మారింది. దీనికి కారణం సాగర్ నీటి లోపల నాచు, నిమజ్జన విగ్రహాల చెత్తతో నిండిపోయివుంది. అందుకే ఇందులో దూకగానే లోపలికి పోవడం తప్ప.. బయటకు వచ్చే పరిస్థితి లేదు. 
 
హుస్సేన్‌ సాగర్‌లో ఆత్మహత్యాయత్నం చేసేవారిని రక్షించేందుకు లేక్‌ పోలీసులు ప్రత్యేక నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశారు. హుస్సేన్‌సాగర్‌ వెంట అక్కడక్కడ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి ఆత్మహత్యాయత్నం చేసేవారి కదలికలను గుర్తించి వారిపై ఓ కన్నేస్తారు. వెను వెంటనే హుస్సేన్‌సాగర్‌లో దూకగానే పోలీసులు గజ ఈతగాళ్లతో రక్షిస్తున్నారు. 
 
ఇలా ప్రతినెలా 15 నుంచి 20 మంది ఆత్మహత్యకు ప్రయత్నించగా కాపాడారు. అయితే ట్యాంక్‌బండ్‌ వెంట చెట్లకొమ్మలు, పిచ్చి మొక్కలు ఏపుగా పెరగడంతో దూకిన వారిని రక్షించడం లేక్‌ పోలీసులకు కష్టతరంగా మారింది. దాంతోపాటు హుస్సేన్‌సాగర్‌లో ట్యాంక్‌బండ్‌ వైపు నీటిలో పెద్దఎత్తున నాచుతో పాటు నిమజ్జన విగ్రహాల పీచుపైకి తేలింది. అందుకే ఈ నీటిలో దూకేవారు చిక్కుకుంటున్నారు. నీటిలో దూకగానే పైకి రాకపోవడంతో వారిని రక్షించడం ఇబ్బందిగా మారిందని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. 
 
హుస్సేన్‌సాగర్‌ ట్యాంక్‌బండ్‌ వెంట తలెత్తుతున్న సమస్యలపై ఇటీవల లేక్‌ పోలీసులు బుద్ధ పూర్ణిమ ప్రాజెక్టు ఓఎస్డీ దృష్టికి తెచ్చారు. దాంతో ఎన్‌టీఆర్‌గార్డెన్‌, లుంబినీపార్కు, సంజీవయ్యపార్కులో సెక్యూరిటీగా విధులు నిర్వర్తిస్తున్న వారిని నాచు, పీచు తొలగింపుతోపాటు చెట్ల కొమ్మలను, పిచ్చికొమ్మలను తొలగించేందుకు వినియోగించి, ఆ వ్యర్థాలను తొలగించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు