ప్రేమించి పెళ్లి చేసుకుని నడిరోడ్డుపై మోటారు బైకు పైనుంచి తోసేశాడు

ఆదివారం, 23 ఆగస్టు 2020 (19:29 IST)
ప్రేమించానని వెంటపడటం... ఆ మోజు తీరిన తర్వాత వదిలించుకోవడం.. ఇలాంటి సంఘటనలు చాలాచోట్ల జరుగుతున్నాయి. అలా మోసం చేసిన వారికి ఎన్ని కఠిన శిక్షలు వేసినా మళ్లీ మామూలే. ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతూనే ఉన్నాయి.
 
వివరాల్లోకి వెళితే... బంజారాహిల్స్ రోడ్డు నంబరు 14లో నివాసం ఉండే ఓ యువతి అదే ప్రాంతంలో ఒక బట్టలకొట్టులో పని చేస్తుండేది. ఆ బట్టల కొట్టు పక్కనే రాజమండ్రిలోని, మల్లవరం నుంచి వచ్చిన యెలమాశెట్టి వెంకన్నబాబు వారి పిన్ని వాళ్ళ ఇంట్లో ఉంటూ ఓ ఆస్పత్రిలో పని చేసేవాడు.
 
 2018లో యువతికి వెంకన్నబాబుకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. వీరిరువురూ 2019 జూలై 13వ తేదీన వెంకన్న బాబు తరపు ఒక స్నేహితుడిని వెంట అన్నవరం తీసుకెళ్లి అక్కడి నిర్మానుష్యంగా ఉన్న ఒక గుళ్లో స్నేహితుడి సాక్షిగా తాళి కట్టాడు. ఆ తర్వాత వారికి పండంటి బాబు పుట్టాడు. అతడికి ఇప్పుడు 5 మాసాలు.
 
తీరా చూస్తే... వెంకన్నబాబు, యువతిని 2020 ఆగష్టు 5వ తేదీన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ ముందు వేగంగా ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనం పై నుంచి నెట్టేసి అక్కడి నుండి పరారయ్యాడు. 
 
దేవుడి దయ వల్ల ఆ బాబుకు ఎలాంటి గాయాలు అవలేదు. కేసు రిజిస్టర్ చేసుకున్న పోలీసులు వెంకన్నకు ఫోన్ చేయగా స్విచాప్ అయి ఉండటంతో అతని అక్క దీవెనకు ఫోన్ చేయగా దురుసుగా సమాధానం చెప్పింది.
 
అసలు ఆ అమ్మాయితో మాకు సంబంధం లేదని ఫోన్ పెట్టిసింది. ప్రేమ పెళ్లి పేరుతో ఒక అమ్మాయిని, అభంశుభం తెలియని 5 మాసాల బాలుడిని రోడ్డు మీద వదిలేసిన ఆ నయవంచకుడిని ఏం చెయ్యాలి? ఇకనైన అమ్మాయిలు ప్రేమించేటప్పుడు కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకోవడం ఎంతైనా అవసరం.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు