వివాహితుడిని ప్రేమించింది.. అతడి భార్యను వేధించింది... చివరకు...

మంగళవారం, 25 మే 2021 (10:59 IST)
ఓ యువతి.. ఓ వివాహితుడిపై మోజు పడింది. అతన్ని ప్రేమించింది. అతన్ని పెళ్లి చేసుకునేందుకు ఓ ప్లాన్ వేసింది. ఆ ప్లాన్‌లో భాగంగా, తాను ప్రేమించిన వ్యక్తి భార్యను టార్చర్ చేసింది. చివరకు పోలీసుల చేతికి చిక్కి జైలు ఊచలు లెక్కిస్తోంది. ఈ ఘటన హైదరాబాద్ నగరంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, బండ్లగూడ హయత్‌నగర్‌ ప్రాంతానికి చెందిన నేహ అలియాస్‌ బ్లెస్సీ.. ఎంఎన్‌సీ కంపెనీలో టీమ్‌లీడర్‌గా పనిచేస్తుంది. ఐటీలో పనిచేస్తుండటంతో విలాసవంతమైన జీవితానికి అలవాటుపడింది. 
 
అయితే, లాక్డౌన్‌ కారణంగా ఆమె ఉద్యోగం పోయి ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. ఈ క్రమంలో ఆమెకు జిమ్‌సెంటర్‌లో ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. అతను ప్రభుత్వ ఉద్యోగి కావడంతో ఆమె అతనితో ఉన్న స్నేహాన్ని ప్రేమగా మార్చుకుంది. 
 
కొంతకాలం తర్వాత అతనికి పెళ్లయిందని, భార్య ఉందని తెలిసింది. దాంతో వారి కాపురాన్ని విచ్ఛిన్నం చేయాలనే ఉద్దేశంతో ఎల్‌బీనగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో అతనిపై కేసు పెట్టింది. అప్పటినుంచి అతను ఆమెతో మాట్లాడటం మానేశాడు. కాంటాక్టులు కట్‌ చేశాడు.
 
ఇదిలావుండగా, ఎలాగైనా అతన్ని దక్కించుకొని సెటిలైపోవాలనుకున్న నేహ కొత్తఫోన్‌ నంబర్‌లను తీసుకొని, నకిలీ ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలను క్రియేట్‌ చేసింది. అతనితో తనకు వివాహేతర సంబంధం ఉందని, అతని భార్యకు, ఆమె కుటుంబ సభ్యులకు పోస్టులు పెట్టసాగింది. 
 
అశ్లీల చిత్రాలు, అసభ్య మెసేజ్‌లు పంపేది. ఎలాగైనా అతని నుంచి భార్య విడిపోవాలని కొత్తకొత్త పోస్టులను క్రియేట్‌ చేసి వేధించేది. దాంతో ఆ మహిళ సైబర్‌ క్రైం పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన సైబర్‌ క్రైం పోలీసులు టెక్నికల్‌ ఎవిడెన్స్‌ ఆధారంగా నిందితురాలు నేహాను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. విచారించగా భార్యా భర్తలను విడదీస్తే అతను తనవైపు వస్తాడనే ఉద్దేశంతో ఇలా చేసినట్లు అంగీకరించింది. దీంతో ఆమెపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి కటకటాల వెనక్కి నెట్టారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు