ఎంబీటీ నేత వేధింపులు : మహిళా జర్నలిస్టు సూసైడ్ అటెంప్ట్

సోమవారం, 14 జూన్ 2021 (09:05 IST)
హైదరాబాద్ నగరంలోని డబీర్‌పురాలో ఎంబీటీకీ చెందిన సయ్యద్ సలీం (66) అనే నేత ఓ మహిళా జర్నలిస్టును వేధించారు. దీంతో ఆ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. సెల్ఫీ వీడియో తీసుకుని నిద్రమాత్రలు మింగి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఆమె ఒవైసీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, గుల్షన్-ఎ-ఇక్బాల్ కాలనీకి చెందిన సయ్యదా నాహీదా ఖాద్రీ (37) ఓ న్యూస్ చానల్‌లో జర్నలిస్టుగా పనిచేస్తుంది. ఎంబీటీ నేత సలీం కొద్ది రోజులుగా ఆమెను వేధిస్తున్నారు. అసభ్యకర వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తూ వేధింపులకు గురిచేస్తున్నాడు.
 
ఈ వేధింపులతో తీవ్ర మనస్తాపానికి గురైన ఖాద్రీ శనివారం రాత్రి ఇంట్లో నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించారు. వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను ఒవైసీ ఆసుపత్రికి తరలించారు. ఖాద్రీ కుమార్తె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సలీంను అరెస్ట్ చేశారు. సలీం అరెస్ట్ విషయం తెలుసుకున్న మజ్లిస్ కార్యకర్తలు పోలీస్ స్టేషన్‌కు చేరుకుని సలీంపై దాడికి యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. 
 
సలీం తనను వేధిస్తున్నట్టు బాధితురాలు ఖాద్రీ మే 25న పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలిసిన నిందితుడు ఫేస్‌బుక్ లైవ్‌లో ఆమెను దూషించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఖాద్రీ.. 20 రోజులుగా నరకం అనుభవిస్తున్నానని, తనకు ఆత్మహత్య తప్ప మరో దారి కనిపించడం లేదని సెల్ఫీ వీడియోలో ఆవేదన వ్యక్తం చేస్తూ నిద్రమాత్రలు మింగి అఘాయిత్యానికి పాల్పడింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు