నీ భార్య నాతో చాటింగ్ చేయపోతే నీ అంతు చూస్తా.. భర్తకు బెదిరింపులు

మంగళవారం, 25 సెప్టెంబరు 2018 (13:42 IST)
సోషల్ మీడియా ద్వారా పెంచుకున్న పరిచయాన్ని ఆసరాగా చేసుకొని వివాహితను, ఆమె భర్తను బెదిరించాడు ఓ యువకుడు. భార్యాభర్తలు ఇరువురు రాచకొండ పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేసుకుని సదరు యువకుడిని రాచకొండ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు.  పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఎల్బీనగర్‌ ప్రాంతానికి చెందిన జీలన్ నోయల్ 2017లో ఫేస్‌బుక్‌లో చూసి అతడు సింగర్‌గా భావించి బాధితురాలు చాట్‌ చేసింది. 
 
కొంత కాలానికి తాను సింగర్ కాదని అనంతపురంలో ప్రైవేటు ఉద్యోగిగా చేస్తున్నానని చెప్పాడు. అలా ఇద్దరి మధ్య స్నేహం పెరిగి ఫోన్‌లు చేసుకునేవారు. కొన్నిసార్లు జీలన్‌ హైదరాబాద్‌కు వచ్చి ఆమెను  కలిసి వ్యక్తిగత ఫోటోలను తీసుకున్నాడు. కొన్ని కారణాలు వల్ల బాధితురాలు అతడితో చాటింగ్‌ చేయడం.. ఫోన్‌కు జవాబివ్వడం మానేసింది. దీంతో జీలన్‌.. ఆమె సెల్‌ఫోన్‌కు అభ్యంతరకర సందేశాల్ని పంపించడం ఆరంభించాడు. అయినా స్పందన లేకపోవడంతో ఆమె భర్తకు ఫోన్‌ చేసి ఒకవేళ ఆమె తనతో మాట్లాడకుంటే ఆమె చిత్రాల్ని మార్ఫింగ్‌ చేసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేస్తానని బెదిరించడం కొనసాగించాడు. 
 
దీంతో దంపతులు పోలీసులను ఆశ్రయించారు. సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా నిందితుడిని గుర్తించి అనంతపురం జిల్లా తాడిపత్రి పరిసరాల్లోని ఎల్లనూరులో పట్టుకున్నారు పోలీసులు. జిలాన్ తప్పు చేసినట్లు అంగీకరించడంతో అరెస్ట్‌ చేసి అతడి ఫోన్‌ను సీజ్‌ చేశారు. ఈ సందర్భంగా ఫేస్‌బుక్‌లో అపరిచితుల ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌లను అంగీకరించవద్దని పోలీసులు హెచ్చిరిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు