రెండు కళ్ల సిద్ధాంతం ఎవరిది?... తెలంగాణ స్టాఫ్ నర్స్ పరీక్షలో వింత ప్రశ్నలు

సోమవారం, 18 సెప్టెంబరు 2017 (09:43 IST)
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల వివిధ శాఖల్లోని ఖాళీల భర్తీకి శ్రీకారం చుట్టింది. ఇందులోభాగంగా, స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ నిర్వహించిన పరీక్షల్లో వింత ప్రశ్నలు అడిగారు. 
 
ఆదివారం నిర్వహించిన ఈ పరీక్షలో తెలంగాణ ఉద్యమానికి సంబంధించి ఆసక్తికర ప్రశ్నలను ఇచ్చారు. 'రెండు కళ్ల సిద్ధాంతాన్ని తెరపైకి తెచ్చింది ఎవరు?' అంటూ ఓ ప్రశ్నను అడిగారు. దీనికి ఆప్షన్లుగా వైఎస్.జగన్మోహన్ రెడ్డి, బీవీ రాఘవులు, వెంకయ్యనాయుడు, చంద్రబాబు నాయుడు పేర్లను ఇచ్చారు. 
 
అలాగే, మరో ప్రశ్నగా... 'లోక్‌సభలో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టినప్పుడు పెప్పర్ స్ప్రేతో దాడి చేసింది ఎవరు?' అంటూ అడిగారు. దీనికి ఆప్షన్లుగా జగన్మోహన్ రెడ్డి, లగడపాటి రాజగోపాల్, నారమల్లి శివప్రసాద్, సుజనా చౌదరిల పేర్లను ఇచ్చారు.
 
కాగా, తెలంగాణ ఉద్యమం ఉధృతంగా నడుస్తున్న సమయంలో ఆంధ్ర, తెలంగాణలు తనకు రెండు కళ్లలాంటివని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్న విషయం తెలిసిందే. అలాగే, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టినపుడు, ఈ బిల్లును అడ్డుకునేందుకు నాడు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ లగడపాటి రాజగోపాల్ పెప్పర్ స్ప్రేను ఉపయోగించిన విషయం కూడా తెలిసిందే. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు