బీజేపీలోకి వలసలు... వచ్చే వారంలో ఈటల.. ఈలోపే కొండా

శుక్రవారం, 4 జూన్ 2021 (08:57 IST)
తెలంగాణ రాష్ట్రంలోని భారతీయ జనతా పార్టీలోకి వలసలు క్రమంగా పెరుగుతున్నాయి. ఆ పార్టీలో చేరే ఇతర పార్టీలకు చెందిన నేతల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే పలువురు నేతలు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. వచ్చే వారంలో తెరాస సీనియర్ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్ కాషాయం కండువా కప్పుకోనున్నారు. ఇంతలోనే కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పిన మాజీ మంత్రి కొండా విశ్వేశ్వర్ రెడ్డి కూడా బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. 
 
ఇదిలావుంటే, బీజేపీలోకి చేరే ఈటల రాజేందర్‌తో పాటు.. మరో తేరాస నేత ఏనుగు రవీందర్ సహా ఐదుగురు బీజేపీలోకి వెళ్లబోతున్నారు. ఈ మేరకు ఈటల శుక్రవారం తన శాసనసభ సభ్యత్వానికి, తెరాస పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయనున్నారు. 
 
ఇదిలావుంటే, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి కూడా బీజేపీలో చేరేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. ఇంతకుముందు టీఆర్ఎస్ తరపున ఎంపీగా గెలిచిన ఆయన గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 
 
గత కొంతకాలంగా కాంగ్రెస్‌కు దూరంగా ఉంటూ వస్తున్న కొండా.. నిన్న బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణతో ఆమె ఫాంహౌస్‌లో సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.
 
ఈ సందర్భంగా విశ్వేశ్వరరెడ్డిని అరుణ బీజేపీలోకి ఆహ్వానించినట్టు తెలుస్తోంది. దీనికి ఆయన కూడా సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది. దీంతో ఆలస్యం చేయకుండా నిర్ణయం తీసుకోవాలని కోరినట్టు సమాచారం. అన్నీ అనుకున్నట్టు జరిగితే త్వరలోనే కొండా కూడా బీజేపీ తీర్థం పుచ్చుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు